Rajya Sabha ఎదుట వ్యవసాయ బిల్లు..ఆమోదం పొందేనా

  • Published By: madhu ,Published On : September 20, 2020 / 09:15 AM IST
Rajya Sabha ఎదుట వ్యవసాయ బిల్లు..ఆమోదం పొందేనా

controversial farm Bills : వివాదాస్పదమవుతున్న వ్యవసాయ బిల్లులను 2020, సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం పెద్దల సభ ముందుకు తేనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులను కొద్దిగంటల్లో రాజ్యసభలో ప్రవేశపెట్టబోతోంది. ఈ సభలోనూ బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.



ఇందుకోసం పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరుకావాలని ఇప్పటికే బీజేపీ విప్ జారీ చేసింది. వ్యవసాయ బిల్లులు రైతు నడ్డి విరిచి, కార్పొరేట్లకు మేలు చేసేలా ఉన్నాయంటూ కాంగ్రెస్, శిరోమణి అకాలీదల్ అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. మరికొన్ని విపక్ష పార్టీలు సైతం బిల్లును వ్యతిరేకించేందుకు రెడీ అయ్యాయి. బీజేపీ మాత్రం వెనక్కి తగ్గకుండా రాజ్యసభలో ప్రవేశపెట్టబోతోంది.



పార్లమెంట్‌ వేదికగా.. కేంద్రం తీసుకొస్తున్న మూడు వ్యవసాయరంగ బిల్లులపై మాటల యుద్ధం నడుస్తోంది. విపక్షాల నిరసనలు, అనేక రాష్ట్రాల్లో రైతుల ఆందోళనల మధ్య మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో గట్టెక్కించింది. ఇక రాజ్యసభలో వీటి ఆమోదమూ లాంఛనప్రాయంగా జరగనుంది.

దేశ వ్యవసాయ రంగంలో సమూల సంస్కరణలకు ఇవి నాంది అని, కొద్ది సంవత్సరాల్లోనే రైతు ఆదాయం రెట్టింపు అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ బిల్లులు కార్పొరేట్లకు, బడా వ్యాపారులకు లాభం చేకూరుస్తాయని, రైతు వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తుందని రాష్ట్రాలు, ప్రతిపక్షాలో అంటున్నాయి.



అయితే.. ప్రతిపక్షాల నిరసన.. రాష్ట్రాల్లో ఆందోళనల మధ్య కేంద్రం ఈ బిల్లులను ప్రవేశ పెట్టబోతోంది. మర ఆమోదం పొందుతుందా ? లేదా ? అనేది కొన్ని గంటల్లో తేలనుంది.