కశ్మీర్ లో ఎవరైనా భూమి కొనుక్కోవచ్చు

  • Published By: venkaiahnaidu ,Published On : October 27, 2020 / 06:43 PM IST
కశ్మీర్ లో ఎవరైనా భూమి కొనుక్కోవచ్చు

Govt paves way for all Indians to buy land in Jammu and Kashmir కేంద్రపాలితప్రాంతం జమ్మూ కశ్మీర్,లడఖ్ లో భూములను కొనుగోలు చేసే విధానంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశానికి చెందిన ఏ పౌరుడైనా ఇప్పటి నుంచి జమ్మూ కశ్మీర్,లడఖ్ లో భూములను కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు మార్గం సుగమం చేస్తూ కొత్త భూ చట్టాలను మంగళవారం(అక్టోబర్-27,2020) కేంద్ర హోంశాఖ నోటిఫై చేసింది. జమ్మూ కశ్మీర్ పునర్వ్యవ్యస్థీకరణ చట్టం ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. దీంతో ఇక దేశంలోని ఏ పౌరుడౌనా కశ్మీర్ ,లడఖ్ లో భూమి కొనుగోలు చేయవచ్చు.



అయితే,జమ్మూకశ్మీర్,లడఖ్ లో నివాసం ఉండే అవకాశాన్ని సైతం అందరికీ కల్పించిన ప్రభుత్వం… వ్యవసాయ భూములను ఇందులో నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొంది. ఈ ఉత్తర్వు తక్షణమే అములోకి వస్తాయని…జనరల్ క్లాజ్ యాక్ట్-1897కు తాజా ఆర్డర్ వర్తిస్తుందని కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. ఈ ఉత్తర్వును జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ మూడవ ఉత్తర్వు, 2020 అని పిలుస్తారని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది.



ప్రభుత్వ ఉత్తర్వుపై స్పందించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా… “జమ్ముకశ్మీర్‌ ఇప్పుడు అమ్మకానికి ఉంది” అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఈ ఉత్తర్వుతో పేద చిన్న భూ యజమానులు బాధపడటం ఖాయమని అబ్దుల్లా తెలిపారు.



కాగా, ఆగష్టు 5, 2019 న జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చిని విషయం తెలిసిందే. తద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం… జమ్మూ కాశ్మీర్, మరియు లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది. అప్పటివరకు జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించబడిన ఆర్టికల్ 370ని అదే రోజు రద్దు చేసిన విషయం తెలిసిందే.