రైతుల ఆందోళనల మధ్య.. మద్దతు ధరకే వరిధాన్యం సేకరణ.. ఇప్పటివరకూ ఎంతంటే?

రైతుల ఆందోళనల మధ్య.. మద్దతు ధరకే వరిధాన్యం సేకరణ.. ఇప్పటివరకూ ఎంతంటే?

Govt procures paddy in KMS 2020-21 : దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకే వరిధాన్యాన్ని సేకరించింది. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (KMS 2020-21)లో ఇప్పటివరకూ మినిమం సపోర్టు ప్రైస్ (MSP) కనీస మద్దతు ధర రూ.1.08 లక్ష కోట్ల విలువైన వరిధాన్యాన్ని సేకరించింది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ అక్టోబర్ నుంచి మొదలైంది. సీజన్ సమయంలో ప్రభుత్వం.. రైతుల నుంచి ప్రస్తుత MSP పథకాల కింద మద్దతు ధరకే వరిపంట ధాన్యాన్ని సేకరిస్తూ వస్తోందని ఆహార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI), ఇతర రాష్ట్రాల ఏజెన్సీల్లోనూ జనవరి 20 నాటికి 575.36 లక్షల టన్నుల వరిధాన్యాన్ని సేకరించింది. గత ఏడాది మార్కెటింగ్ సీజన్ లో 466.22 లక్ష టన్నుల నుంచి 23.41శాతం వరిధాన్యం సేకరణ పెరిగింది. ఈ KMS సేకరణ పథకం కింద ఇప్పటికే 82.08 లక్షల రైతులు లబ్ధిపొందారు. కనీస మద్దతు ధర కింద చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం రూ.1,08,629.27 కోట్ల విలువైన వరిధాన్యాన్ని సేకరించిందని నివేదిక పేర్కొంది.

మొత్తం 575.36 లక్షల టన్నులు వరిధాన్యం సేకరించగా.. అందులో ఒక్క పంజాబ్ రాష్ట్రం నుంచే 202.77 లక్షల టన్నుల వరిధాన్యాన్ని సేకరించింది ప్రభుత్వం. ప్రధానంగా పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున వేలాది మంది రైతులతో ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి.