Niti Aayog : కరోనా సెకండ్ వేవ్ తో దారుణంగా పరిస్థితులు..తర్వలో మరో ఉద్దీపన ప్యాకేజీ
కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పరిస్థితులు ప్రస్తుతం చాలా దారుణంగా ఉన్నాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు.
Niti Aayog VC కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పరిస్థితులు ప్రస్తుతం చాలా దారుణంగా ఉన్నాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. వినియోగదారులు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ల విషయంలో మరింత అనిశ్చితి తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. సెకండ్ వేవ్ సేవల రంగంలాంటి వాటిపై ప్రత్యక్ష ప్రభావం చూపడంతోపాటు ఆర్థిక కార్యకలాపాలపై పెద్ద ఎత్తున పరోక్ష ప్రభావం చూపే అవకాశం ఉన్నదని ఆయన చెప్పారు. ఈ రెండు ప్రభావాలను ఆర్థిక శాఖ అంచనా వేసిన తర్వాత తగిన సమయంలో ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజీవ్ కుమార్ తెలిపారు.
నిజానికి కొవిడ్ను పూర్తిగా లేకుండా చేసే స్థితికి ఇండియా వచ్చిందని, అయితే యూకే, ఇతర దేశాల వేరియంట్లు దేశంలోకి ప్రవేశించడంతో పరిస్థితి మారిపోయిందని రాజీవ్ కుమార్ అన్నారు. అయితే 2022, మార్చి 31తో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి రేటు 11 శాతంగా ఉంటుందని రాజీవ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, దేశంలో వరుసగా నాలుగో రోజూ 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,61,500 కరోనా పాజిటివ్ కేసులు, 1,501 మరణాలు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,88,109కు చేరగా.. 1,28,09,643 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 1,77,150 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 18,01,316 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది.