Sonia Gandhi : దళాల ఉపసంహరణతో భారత్ కు నష్టం!
గతేడాది ఇదే రోజున తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన సైనికులకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులర్పించారు.
Sonia Gandhi గతేడాది ఇదే రోజున తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన సైనికులకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులర్పించారు. గల్వాన్ ఘర్షణకు ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం సోనియాగాంధీ మాట్లాడుతూ.. గల్వాన్ ఘటన జరిగిన పరిస్థితుల గురించి ప్రభుత్వం వివరించి,జవాన్ల త్యాగం వృథా కాలేదని భరోసా ఇస్తుందని కాంగ్రెస్ ఏడాది కాలంగా ఎదురుచూసిందని..అయితే మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు.
సరిహద్దుల్లో అమరవీరుల త్యాగాలు వృథా కాలేదనే విశ్వాసాన్ని దేశ ప్రజల్లో నింపాలని ప్రభుత్వాన్ని సోనియా గాంధీ కోరారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులను సగర్వంగా స్మరిస్తున్నామని సోనియా అన్నారు.
ఇక,తూర్పు లడఖ్ లో బలగాల ఉపసంహరణపై ఇటీవల చైనాతో కుదిరిన ఒప్పందం భారత్ కు నష్టదాయకంగా కనిపిస్తోందని సోనియా అన్నారు. ఏప్రిల్ 2020 కన్నా ముందు ఉన్న పరిస్థితిని నెలకొల్పేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేపట్టారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సోనియా వెల్లడించారు.