GST Revenue: రికార్డు స్థాయిలో 1.41లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

ఒకవైపు కరోనా విజృంభిస్తున్నప్పటికీ మరో వైపు పన్ను వసూళ్ళ జోరు తగ్గడం లేదు. ఏప్రిల్ నెలలో వసూలైన రూ.1.41 లక్షల కోట్ల మేర ....

GST Revenue: రికార్డు స్థాయిలో 1.41లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

gst-collections-at-all-time-high-of-over-rs-1-15-lakh-crore-in-April-20201

GST Revenue: ఒకవైపు కరోనా విజృంభిస్తున్నప్పటికీ మరో వైపు పన్ను వసూళ్ళ జోరు తగ్గడం లేదు. ఏప్రిల్ నెలలో వసూలైన రూ.1.41 లక్షల కోట్ల మేర వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ను ప్రకటించింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. మార్చి నెలలో వసూలైన రూ. 1.23 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 14 శాతం అధికమవడం గమనార్హం.

వరుసగా 7 నెలలుగా లక్ష కోట్లకు పైగా వసూలవగా.. ఈ ట్యాక్స్ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత భారీ మొత్తంలో వసూలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటున్నట్లు ఈ పన్ను వసూళ్ళు సిగ్నల్స్ ఇస్తున్నాయని, ఫేక్‌ బిల్లులపై ప్రత్యేక దృష్టిసారించడం కూడా పన్ను వసూళ్ళు పెరగడానికి దోహదం చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఏప్రిల్ లో మొత్తంగా రూ.లక్షా 41వేల 384 కోట్ల మేర జీఎస్టీ వసూలు అవగా.. దీంట్లో సెంట్రల్‌ జీఎస్టీ కింద రూ. 27వేల 837 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ. 35వేల 621 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ. 68వేల 481 కోట్లు, సెస్‌ రూపంలో రూ. 9వేల 445 కోట్ల మేర వసూలైనట్లు తెలిపింది.

కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో గత నెల దేశవ్యాప్తంగా పలుచోట్ల లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు అమల్లోకి వచ్చి వ్యాపారాలపై ప్రభావం చూపిస్తున్నాయి. అయినప్పటికీ దేశీయ వ్యాపారులు సరైన సమయంలో జీఎస్టీ బకాయిలు చెల్లించాలని ఫైనాన్షియల్ మినిస్ట్రీ పేర్కొంది. లాక్‌డౌన్‌ కారణంగా గతేడాది ఏప్రిల్‌ నెలలో కేవలం రూ.32వేల 172 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.

రాబోయే నెలల్లో పన్ను వసూళ్ళు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండొచ్చని పన్ను విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించడం కారణమని విశ్లేషించారు.