GST Council Meeting: మే నెలలో రూ.4100 కోట్ల ఆదాయం కోల్పోయాం – హరీష్ రావు
శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 44వ సమావేశం ప్రారంభమైంది.
GST Council Meeting: శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ 44వ సమావేశం జరిగింది. ఇందులో కరోనాకు సంబంధించిన ముఖ్యమైన వస్తువులపై జీఎస్టీ ధరలు తగ్గించడంపై నిర్ణయం తీసుకొనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు మాట్లాడారు. మే నెలలో కరోనా లాక్ డౌన్ కారణంగా రూ.4100 కోట్ల ఆదాయాన్ని కోల్పోయమని తెలిపారు. ఇక ఎఫ్ఆర్బీఎంను నాలుగు శాతం నుంచి ఐదు శాతానికి పెంచాలని సూచించారు.
ఎఫ్ఆర్బీఎం పెంపు వలన ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని, ఉద్యోగ కల్పన పెరుగుతుందని తెలిపారు. అవసరాలకు అనుగుణంగా కోవిడ్ వ్యాక్సిన్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని త్వరితగతిన వ్యాక్సినేషన్ పూర్తీ చెయ్యాలని కోరారు. వ్యాక్సినేషన్ పూర్తైతే అన్ని కార్యకలాపాలు సజావుగా సాగుతాయని వివరించారు. పరిస్థితులు ఇలానే ఉంటే ఆర్ధికంగా మరింత నష్టపోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. దేశ అవసరాలకు సరిపడా వ్యాక్సిన్ ను విదేశాలనుంచి తెప్పించాలని కోరారు. ఇక జీఎస్టీ కౌన్సిల్ కరోనా మందులపై జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించారు హరీష్ రావు.