hathras tension : హత్రాస్ కు రాహుల్, ప్రియాంక గాంధీ

  • Published By: madhu ,Published On : October 1, 2020 / 01:42 PM IST
hathras tension : హత్రాస్ కు రాహుల్, ప్రియాంక గాంధీ

hathras tension : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో హైటెన్షన్ నెలకొంది. నెల రోజుల వ్యవధిలో నలుగురు యువతులు అత్యాచారం, దారుణ హత్యకు గురయ్యారు. వరుస అత్యాచార ఘటనలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామాకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ డిమాండ్ చేస్తున్నారు.



హత్రాస్‌ అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని ప్రియాంక గాంధి, సోదరుడు రాహుల్ గాంధీ తో కలిసి పరామర్శించనున్నారు. హత్రాస్ సరిహద్దుల్లో సోనియా, ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ నేతలు, అభిమానులు స్వాగతం పలికారు. ప్రియాంక రాకనేపథ్యంలో పోలీసులు హత్రాస్‌లో 144సెక్షన్ విధించారు. ముందస్తుగా బలగాలను మోహరించారు.



వరుస ఘటనలకు వ్యతిరేకంగా యూపీలో ఆందోళనలు ఉధృతమవడంతో హత్రాస్‌ సరిహద్దులను మూసివేశారు. గ్రామంలో 144 సెక్షన్‌ విధించారు. ఐదుగురి కంటే ఎక్కువ గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. హత్రాస్‌ బాధిత కుటుంబాన్ని కలిసేందుకు ప్రియాంక గాంధీ వస్తారన్న ప్రచారం నేపథ్యంలో యూపీలో పోలీసులు భారీగా మోహరించారు.



మరోవైపు హత్రాస్‌ ఘటనపై సిట్‌ దర్యాప్తు మొదలైంది. విచారణలో భాగంగా బాధిత కుటుంబాన్ని సిట్‌ బృందం కలవనుంది. నిన్న బాధిత కుటుంబసభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు సీఎం యోగి ఆదిత్యనాథ్.



యూపీ వ్యాప్తంగా వరుస రేప్‌ కేసులు నమోదవుతున్నాయి. మహిళలపై వరుస అఘాయిత్యాలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. బాధిత కుటుంబాల్లో కన్నీటి శోకాన్ని మిగులుస్తున్నాయి. హత్రాస్‌ ఘటనపై దేశం మొత్తం రగిలిపోతుండగా ఆ గ్రామానికి కేవలం 5వందల కిలోమీటర్ల దూరంలో మరో మహిళపై అదే తరహా అఘాయిత్యం జరగడం కలకలం రేపుతోంది.



యువతిని గ్యాంగ్‌ రేప్‌ చేసి చిత్రహింసలు పెట్టారు రాక్షసులు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతోన్న ఆ యువతిని చికిత్స కోసం తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయింది.



బల్‌రామ్‌పూర్‌కు చెందిన ఓ దళిత మహిళ రోజులానే కూలీ పనికి వెల్లింది. అయితే సమయానికి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సాయంత్రం 7 గంటల సమయంలో నడవలేని స్థితిలో, చేతికి సెలైన్‌ బాటిల్‌తో ఈ-రిక్షాలో ఇంటికి చేరింది బాధితురాలు. కడుపులో నొప్పిగా ఉందని, నడవలేనని తల్లికి చెప్పింది. తనను రక్షించాలని, తనకు చావాలని లేదంటూ ఏడుస్తూ తన తల్లిని బతిమాలింది.



దీంతో కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. యువతిని పరిశీలించిన డాక్టర్‌ ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో అచేతన స్థితిలో ఉన్న ఆమెను లక్నోకు తీసుకెళ్తుండగా, బల్‌రామ్‌పూర్‌ నగరం దాటకముందే కన్నుమూసింది. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం చేయగా సంచలన విషయాలు బయటికొచ్చాయి.



బాధిత యువతికి మత్తు మందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని రిపోర్టులో తేలింది. మృగాళ్లు ఆమె వెన్నెముకను విరచేయడంతోపాటు శరీర భాగాలను తీవ్రంగా గాయపరిచారని డాక్టర్లు చెప్పారు. యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు ఆమె సోదరుడు చెప్పారు.



ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే హత్రాస్‌ ఘటన జరిగి నెల కూడా కాకుండానే అదే తరహా ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇక వరుస లైంగిక దాడి ఘటనలపై యూపీ అట్టుడుకుతోంది. హత్రాస్‌ బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు.



మహిళలపై అఘాయిత్యాలు ఆపాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మహిళలకు రక్షణ ఏది అంటూ రగిలిపోయారు. ఢిల్లీలోనూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు. ఉద్రిక్తత నెలకొనడంతో పలు చోట్ల నేతలను అరెస్ట్‌ చేశారు పోలీసులు.