RSS దసరా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా శివ్ నాడర్
అక్టోబర్ 8 న నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ నిర్వహించే విజయదశమి కార్యక్రమానికి HCL ఫౌండర్,చైర్మన్ శివ్ నాడర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాజకీయ పరిశీలకులు నిశితంగా చూసే ఈ వార్షిక కార్యక్రమానికి గతంలో బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి, మాజీ దళిత మత నాయకుడు నిర్మల్ దాస్ మహారాజ్, డీఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ మాజీ డైరక్టర్ జనరల్ విజయ్ కుమార్ సరస్వత్,ఆధ్యాత్మిక గురువు, సాధు వాస్వానీ మిషన్ హెడ్ దాదా జేపీ వాస్వానీ,మాజీ బ్యూరోక్రాట్ సత్యప్రకాష్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగాలతో సహా ఈ సభలో చేసిన ప్రసంగాలను రాజకీయ పరిశీలకులు నిశితంగా గమనిస్తుండటంతో ఆర్ఎస్ఎస్ దసరా ఈవెంట్స్ కి ఓ ప్రాముఖ్యత ఏర్పడింది. అంతేకాకుండా 1925లో విజయదశమి రోజున కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ సంస్థను స్థాపించిన సందర్భంగా ఇది ఆర్ఎస్ఎస్ ఫౌండేషన్ డేగా కూడా సెలబ్రేట్ చేయబడుతుందన్న విషయం తెలిసిందే. గత సంవత్సరం విజయదశమి ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్… హిందుత్వం ఈ దేశపు శాశ్వతమైన నీతి అని వ్యాఖ్యానించారు.