జడ్జీలకు గౌరవం ఇవ్వండి : హైకోర్ట్ సర్క్యులర్
ఢిల్లీ: న్యాయమూర్తుల పట్ల కనీసం గౌరవం ఇవ్వటంలేదనీ..వారికి గౌరవం ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ జారీ చేసిన సర్క్యులర్ కూడా జారీ చేసింది. న్యాయమూర్తులు గ్యాలరీల్లో నడుస్తున్న సమయంలో అధికారులు, లాయర్లు, పోలీసులు, కోర్టు సిబ్బంది వారికి ఏమాత్రం గౌరవం ఇవ్వటంలేదని ఇది మంచి పద్ధతి కాదని తెలిపింది.
న్యాయమూర్తులు కోర్టు హాలులోకి వచ్చేటప్పుడు..తిరిగి వారు తమ చాంబర్లలోకి వెళేటప్పుడు ఆ సమయంలో అధికారులు, సిబ్బంది ఇష్టానుసారం ఎవరికి వారు వ్యవహరిస్తుంటారనీ..జడ్జీలను చూసినప్పుడు అధికారులు..సిబ్బంది కనీసం నిలబడకుండా వారిని దాటుకుని వెళ్తున్నారనీ..ఇది కచ్చితంగా వారిని అగౌరవపర్చడమేనని సర్క్యులర్ లో పేర్కొంది. న్యాయమూర్తులు గ్యాలరీల నుంచి వెళుతున్నప్పుడు వారికి అత్యున్నత గౌరవం ఇవ్వాలనీ..ఈ విషయంలో ఏమాత్రం తేడాగా వ్యహరిస్తే తీవ్రంగా పరిగణిస్తాం అని మార్చి 30న కోర్టు రిజిస్ట్రార్ జనరల్ సర్క్యులర్ లో తెలిపింది.
ఈ క్రమంలో హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు ఫ్యూడల్ విధానాల్ని తలపిస్తున్నాయని కొందరు విమర్శిస్తున్నారు. న్యాయమూర్తులు వారి విధుల్ని నిర్వహించేందుకు వెళుతుంటే అందరు ఎందుకు ఆగిపోవాలనీ..తమ పనులు ఎందుకు ఆపివేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. న్యాయమూర్తులంటే న్యాయానికి ప్రతి రూపం..న్యాయశాస్త్రాన్ని అనుసరించి కేసుల్లో తీర్పుల నిచ్చే జడ్జీలను న్యాయమూర్తులని గౌరవిస్తాం. కానీ వారు నడుస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో ఎవ్వరు ఉన్నా వారు నడవకుండా ఫ్రీజ్ అయిపోవాలనే జారీ చేసిన ఈ సర్క్యులర్ పై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.