ఎన్నో విశేషాలు : ప్రపంచంలోనే ఎతైన పోలింగ్ స్టేషన్
టషీగంగ్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ మన దేశంలో ఉంది. అది హిమాచల్ప్రదేశ్లోని టషీగంగ్. రాష్ట్రంలోని లాహౌల్ -స్పితి జిల్లాకు చివరిగా..చైనా సరిహద్దుల్లో ఉన్న గ్రామం. లోక్సభ ఎన్నికలు-2019 కోసం తొలిసారిగా ఈ గ్రామంలో అధికారులు పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. దీంతో ఈ గ్రామానికి చెందిన ప్రజలకు తమ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం లభించింది. ఈ పోలింగ్ స్టేషన్ భూమికి 15,256 అడుగుల ఎత్తున ఉంది.
దీనికి ముందు అత్యంత ఎత్తయిన పోలింగ్ స్టేషన్గా ఇదే జిల్లాలోని హిక్కిం గ్రామంలోని పోలింగ్ స్టేషన్ పేరొందింది. హిక్కిం పోలింగ్ స్టేషన్ ఎత్తు 14,567 అడుగులు ఎత్తు కాగా టషీగంగ్ స్టేషన్ ఎత్తు 15,256 అడుగుల ఎత్తు ఉంది. ఇక్కడ ఎప్పుడు..మూడు నుంచి నాలుగు అడుగులు మందంగా మంచు పేరుకుపోయి ఉంటుంది. ఆ ప్రాంతంలో శ్వాస తీసుకోవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అయినా సరే అంతటి క్లిష్టపరిస్థితుల్లో కూడా ఓట్లు వేసేందుకు ఆ ప్రాంత ప్రజలు ఉత్సాహం చూపుతుంటారు. తమ ప్రాంతంలో కూడా పోలింగ్ స్టేషన్ నెలకొల్పినందుకు వారు చాలా సంతోషం వ్యక్తంచేస్తు..తమ సంప్రదాయ దుస్తుల్లో వచ్చి ఓటు వేసేందుకు వస్తామంటున్నారు.
2019 మే నెలలో తొలిసారిగా ఇక్కడ పోలింగ్ జరగనుంది. కాగా గ్రామంలో 49 మంది ఓటర్లుండగా, వారిలో 29 మంది పురుషులు, 30 మంది మహిళలు ఉన్నారు. అంటే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఒక్కరు ఎక్కువగా ఉన్నారు. కాగా వీరిలో 19 సంవత్సరాల వయస్సున్న అతి చిన్న ఓటరు కజాంగ్ ఉండగా..78 సంవత్సరాల రిగాగిన అనే పెద్ద ఓటరు ఉండటం విశేషం. గతంలో ఎన్నికల సమయంలో వీరంతా 12 కిలోమీటర్ల దూరంలోని పోలింగ్ స్టేషన్కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేవారు.