Vaccine Wastage : దేశ వ్యాప్తంగా 23 శాతం వ్యాక్సిన్లు వృథా : సమాచార హక్కు చట్టం
23 % corona Vaccine Wastage : ఒకపక్క కరోనా సెకండ్ వేవ్ తన ప్రతాపాన్ని చూపిస్తుంటే..మరోపక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది ప్రభుత్వం. ఓ పక్క వ్యాక్సిన్ అందుబాటులో లేక కొన్ని చిన్న చిన్న దేశాలు కష్టాలు పడుతుంటే..భారత్ లో మాత్రం వ్యాక్సిన్లు వృథా అవుతున్నాయని సమాచార హక్కు చట్టం చెబుతోంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11వ తేదీ వరకు 23 శాతం వ్యాక్సిన్లు వృథా అయ్యాయి. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం తెలిసింది.
వ్యాక్సిన్లు వృథా అయిన రష్ట్రాల్లో తమిళనాడు ప్రథమస్థానంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడులో అత్యధిక స్థాయిలో టీకాలు వృథా అయినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు ఇస్తున్నారు. రెండో విడతలో మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు ఇవ్వనున్నారు. ఈక్రమంలో వ్యాక్సిన్లు వృథా కావటం గమనించాల్సిన విషయం.
తమిళనాడులో 12.10 శాతం వ్యాక్సిన్లు వృథా కాగా హర్యానాలో 9.74 శాతం, పంజాబ్ లో 8.12 శాతం, మణిపూర్ లో 7.8 శాతం, తెలంగాణలో 7.55 శాతం వ్యాక్సిన్లు వృథా అయ్యాయని సమాచారం చట్టం తెలిపింది. ఏఫ్రిల్ 11 వరకూ 10 కోట్ల మోతాదులో 44 లక్షలకుపైగా మోతాదులు వృథా అయ్యాయని సమాచార హక్కు చట్టం వెల్లడించింది.
కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను ప్రస్తుతం ఇండియన్లకు ఇస్తున్నారు. తమిళనాడుతో పాటు హర్యానా, పంజాబ్, మణిపూర్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ శాతం వ్యాక్సిన్లు వృథా కాగా..కేరళ, బెంగాల్, హిమాచల్ప్రదేశ్, మిజోరమ్, గోవా, డమన్ అండ్ డయూ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్లో మాత్రం జీరో వేస్టేజ్ ఉన్నట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది.