వరకట్నం కోసం బాలింతను కొట్టి చంపిన భర్త, అత్తమామలు
Husband and mother-in-law who beat woman to death : ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. కట్నం కోసం భర్త, అత్తమామలు బాలింతను కొట్టి చంపారు. పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలంటూ అన్నూ అనే యువతిని ఆమె భర్త, అత్తమామలు ఏడాదిన్నరగా వేధిస్తున్నారు. చివరకు బాలింత అని కూడా చూడకుండా కొట్టి చంపారు. ఈ ఘటన షామ్లీ జిల్లా తానాభవన్ పోలీస్స్టేషన్ పరిధిలోని మోర్ మజ్రాలో చోటుచేసుకుంది.
భర్త, అత్తమామలు చిత్రహింసలు పెడుతున్నారంటూ తమ కూతురు ఫోన్ చేసిందని, తాము తమ బిడ్డను రక్షించుకుందామని వెళ్లేసరికే శవమై పడివుందని మృతురాలి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఏడాదిన్నర క్రితం అన్ని రకాల కట్న కానుకలతో తమ బిడ్డను మెట్టినింటికి సాగనంపామని, పెళ్లి జరిగిన నెల నుంచే అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయని అన్నూ తల్లిదండ్రులు ఆరోపించారు.
అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని తమ కూతురు చెప్పినప్పుడల్లా సర్దిచెబుతూ వచ్చామని, కానీ ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయామని వాపోయారు. రెండు నెలల క్రితమే తమ బిడ్డ ఒక పాపకు జన్మనిచ్చిందని, పచ్చిబాలింత అని కూడా చూడకుండా అత్తింటివారు వేధించి చంపారంటూ కన్నీరుమున్నీరయ్యారు.
ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.