కనకదుర్గను గెంటేసిన అత్తింటివారు
తిరువనంతపురం: చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే అంటూ శబరిమలలోకి ప్రవేశించిన కనకదుర్గ అత్తింటివారు ఆమెను ఇంట్లో నుంచి గెంటేశారు. అయ్యప్ప ఆలయంలోకి అడుగుపెట్టినందుకు కనకదుర్గ అత్త ఆమెపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా కనకదుర్గను ఇంట్లోకే రానివ్వడంలేదట. దీనితో ప్రస్తుతం ఆమె కేరళలోని పథనమ్తిట్ట జిల్లాలోని ఓ ప్రభుత్వ గృహంలో తలదాచుకుంటోంది.
కనకదుర్గ తమతో అబద్ధం చెప్పి ఆలయంలోకి వెళ్లిందని ఆమె అత్తింటివారు అంటున్నారు. ఇటీవల కనకదుర్గకు, బిందుకు 24 గంటలూ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. దాంతో పోలీసులు కనకదుర్గ అత్తింటి వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నా..వారు మాత్రం ఒప్పుకోవడం లేదు. కనకదుర్గ బహిరంగంగా అయ్యప్ప భక్తులకు క్షమాపణలు చెప్పాలని…చెబితే ఇంట్లోకి ఎంట్రీ ఉంటుందని ఖరాఖండిగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆలయంలోకి ప్రవేశించిన బిందుకు మాత్రం తన ఇంటివారి నుంచి ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. ఇంట్లో వారు పూర్తిగా మద్దతునిస్తున్నారని బిందు వెల్లడించారు.