కల్కి లీలలు : రూ.33కోట్ల నగదు సీజ్.. ఆఫ్రికా, ఖతార్ దేశాల్లోనూ ఆస్తులు

కల్కి ఆశ్రమాలు, ప్రధాన కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం(అక్టోబర్ 17,2019) 2వ రోజు కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఏపీ, తెలంగాణ,

  • Published By: veegamteam ,Published On : October 17, 2019 / 05:18 AM IST
కల్కి లీలలు : రూ.33కోట్ల నగదు సీజ్.. ఆఫ్రికా, ఖతార్ దేశాల్లోనూ ఆస్తులు

కల్కి ఆశ్రమాలు, ప్రధాన కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం(అక్టోబర్ 17,2019) 2వ రోజు కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఏపీ, తెలంగాణ,

కల్కి ఆశ్రమాలు, ప్రధాన కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం(అక్టోబర్ 17,2019) 2వ రోజు కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. 400 మంది అధికారులు 10 బృందాలుగా రంగంలోకి దిగారు. కల్కి ప్రధాన ఆశ్రమం తమిళనాడు పోలీసుల పహారాలో ఉంది. దాడుల సమయంలో కల్కి భగవాన్‌, ఆయన భార్య పద్మావతి అందుబాటులో లేరు. చెన్నై నుంగంబాకంలోని మెయిన్ ఆఫీస్ లో కల్కి కొడుకు కృష్ణ, కోడలు ప్రీతిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు.

తొలి రోజు ఐటీ సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. రూ.33 కోట్ల క్యాష్ సీజ్ చేశారు. అందులో భారత కరెన్సీకి సంబంధించి రూ.24 కోట్లు ఉన్నాయి. చెన్న, బెంగళూరు నగరాల్లో భారీగా భూములు కొన్నట్టు గుర్తించారు. ఆఫ్రికా, ఖతార్ దేశాల్లోనూ ఆస్తులున్నట్లు కనుగొన్నారు. ట్రస్ట్ నిర్వాహాకులు కృష్ణాజీ దంపతులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. కృష్ణాజీ ఇంట్లో రూ.9కోట్ల అమెరికన్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెం, బీ ఎన్‌. కండ్రిగ మండలాల్లో ఉన్న ఆశ్రమాల ట్రస్ట్‌ నిర్వహాకుడు లోకేష్‌ దాసాజీతో పాటు మరికొంతమంది సిబ్బందిని ఐటీ అధికారులు రహస్యంగా విచారిస్తున్నారు. ఈ సోదాల్లో వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. అలాగే బినామీల పేరుతో వేల ఎకరాల భూముల క్రయ విక్రయాలు జరిపినట్లు అధికారులు కనుగొన్నారు. 

గతంలో కూడా కల్కి భగవాన్‌ ఆశ్రమంలో జరుగుతున్న వ్యవహారాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఆశ్రమంలో భక్తులకు మత్తు పదార్థాలు ఇచ్చి వారిని మత్తులో ఉండేలా చేయడంతో పాటు, లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. విజయ్‌ కుమార్‌ నాయుడు అలియాస్‌ కల్కి భగవాన్‌ తొలినాళ్లలో ఎల్‌ఐసీలో క్లర్క్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి ఓ విద్యాసంస్థను నెలకొల్పారు. అది కాస్తా దివాళా తీయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విష్ణుమూర్తి పదో అవతారం కల్కి భగవాన్‌గా చెప్పుకుంటూ విజయ్‌ కుమార్‌ 1989లో చిత్తూరు జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. 

ఆ తర్వాత తన ఆశ్రమ కార్యాకలాపాలను ఏపీతో పాటు తమిళనాడుకు విస్తరించారు. కల‍్కి భగవాన్‌ తనతో పాటు భార్య పద్మావతిని దైవాంశ స్వరూపులుగా చెప్పుకునేవారు. వీరి ఆశ్రమానికి దేశంలోని ధనవంతులే కాకుండా విదేశీయులు, ఎన్నారైలు క్యూ కట్టేవారు. కల్కి భగవాన్‌ సాధారణ దర్శనానికి రూ.5వేలు, ఇక​ ప్రత్యేక దర్శనం కావాలంటే రూ.25 వేలు చెల్లించుకోవాల్సిందే. కల్కి కుమారుడు కృష్ణాజీ కూడా పెద్ద ఎత్తున భూములు ఆక్రమించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నట్లు ఫిర్యాదుతో 2010లో ఏపీ హైకోర్టు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. 2008లో చిత్తూరు జిల్లాలోని కల్కి ఆశ్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు చనిపోగా, అనేకమంది గాయపడ్డారు. దీంతో కొద్దిరోజులు ఆశ్రమం మూతపడింది. కల్కి లీలలు చూసి అధికారులే షాక్ అవుతున్నారు.