బెంగాల్..కశ్మీర్ లా మారితే తప్పేంటి? : ఒమర్ అబ్దుల్లా
Omar Abdullah’s dig at Suvendu వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే బెంగాల్.. కశ్మీర్లా తయారవుతుందన్న బీజేపీ నేత సువేందు అధికారి వ్యాఖ్యలను ఖండించారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా. ఆయన వ్యాఖ్యలు అవివేకమైనవన్నారు. 2019 ఆగస్టులో కేంద్రప్రభుత్వం కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత..కశ్మీర్ స్వర్గంలా మారిందని బీజేపీ తెలిపింది. మరి ఇప్పుడు బెంగాల్.. కశ్మీర్లా మారితే తప్పేంటి? ఏదేమైనా..బెంగాల్ ప్రజలు కశ్మీర్ను ప్రేమిస్తారు అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.
కాగా, ఇవాళ బెహాలాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమానికి హాజరైన సువెందు అధికారి సీఎం మమతా బెనర్జీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. శ్యామా ప్రకాశ్ ముఖర్జీ లేకపోయుంటే భారత్ ఇస్లామిక్ దేశంలా మారిపోయేది.. మనం బంగ్లాదేశ్లో నివసిస్తుండేవాళ్లం. తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే బంగాల్ మరో కశ్మీర్లా తయారవుతుందని సువెందు అధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు, నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతకు పోటీగా బరిలోకి దిగుతానని సువేందు అధికారి ఇప్పటికే ప్రకటించారు. మమతపై 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని సవాల్ విసిరారు.
ఇక,294 స్థానాలున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ మార్చి-27 నుంచి ఏప్రిల్-29వరకు ఎనిమిది దశల్లో జరగనున్నాయి. మార్చి-27న మొదటి దశ,ఏప్రిల్-1న రెండో దశ,ఏప్రిల్-6న మూడో దశ,ఏప్రిల్-10న నాల్గవ దశ,ఏప్రిల్-17న ఐదవ దశ,ఏప్రిల్-22న ఆరవ దశ,ఏప్రిల్-26న ఏడవ దశ,ఏప్రిల్-29న ఎనిమిదశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.