ఓటరు హక్కు : వీవీ ప్యాట్ పనిచేయకుంటే కంప్లైంట్ చేయండి
హైదరాబాద్ : ఒకప్పుడు ఓటు అంటే బ్యాలెట్ పేపర్ తో వేసేవాళ్లం. కానీ స్మార్ట్ విధానం అందుబాటులోకి వచ్చాక బ్యాలెట్ పేపర్ స్థానంలోకి ఈవీఎంలు వచ్చాయి. ఈ ఈవీఎంల విధానం అందుబాటులోకి వచ్చి పదేళ్లయింది. వీటిపై పలు విమర్శలు కొనసాగుతునే ఉంది. వీటితో ట్యాంపరింగ్ జరుగుతున్నాయనీ… ఫలితాలను తారుమారు చేస్తున్నారన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఈవీఎంలు ల్లో ఒకరికి ఓటు వేస్తే మరొకరికి పడుతుందనేది ఇందులో ప్రధానమైన ఆరోపణ.
ఈ ఆరోపణలు, విమర్శలకు చెక్ పెట్టేందుకు…మరింత పారదర్శకత కోసం ఈసీ వీవీప్యాట్ (ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) అనే కొత్త యంత్రాన్నీ తీసుకొచ్చింది. దీంతో ఓటరు తనకు నచ్చిన గుర్తుపై ప్రెస్ చేసినప్పుడు తన ఓటు ఎవరికి పడిందో తెలిపేలా ఓ రసీదు పేపర్ వీవీ ప్యాట్లో ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. తరువాత అది ప్యాట్ కింద అమర్చిన బాక్సులో పడుతుంది.
ఓటరు ఫిర్యాదు చేసే అవకాశం
ఓటింగ్ సమయంలో వీవీ ప్యాట్ సక్రమంగా పనిచేయకున్నా..పనిచేయటంలేదనీ అనుమానం వచ్చినా అక్కడే ఉన్న ప్రిసైడింగ్ అధికారికి కంప్లైంట్ చేయొచ్చు. ఓటరు వేసిన గుర్తుకు కాకుండా వేరే గుర్తుకు పడితే తిరిగి ఓటు వేసే అవకాశం ఇవ్వాలని అధికారులను కోరవచ్చు. దీనినే టెస్ట్ ఓట్ అంటారు. అధికారులు, పోలింగ్ ఏజెంట్లు సమక్షంలో తన ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వీవీ ప్యాట్ పనిచేయటంలేదని ఓటరు కంప్లైంట్ చేస్తే ..దాన్ని అధికారులు పరిశీలించి లోపం ఉందని తేలితే పోలింగ్ ఆపివేయాలి.ఈ విషయాన్ని వెంటనే రూట్ అధికారి, రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లాలి.
అలా చేస్తే జైలే
వీవీ ప్యాట్ ల విషయంలో ఓటరు అధికారులను ఆటపట్టించటానికో లేదా..ఫన్నీగా బిహేవ్ చేసినట్లుగా తేలితే అది తీవ్రమైన నేరం. ఇలా చేస్తే వారికి జరిమానా కానీ జైలుశిక్ష కానీ, ఆయా సందర్భాలను బట్టి..ఓటరు వ్యవహరించిన తీరును బట్టి కొన్ని సందర్భాల్లో జరిమానా..జైలు శిక్షా రెండు పడే అవకాశాలు కూడా ఉంది.