ఐఎంఏ షాక్ : పతంజలి”కరొనిల్”తో కేంద్ర ఆరోగ్య మంత్రికి చిక్కులు
కరోనా ఎదుర్కొనేందుకు పతంజలి సంస్థ విడుదల చేసిన కరొనిల్ టాబ్లెట్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) విస్మయం వ్యక్తం చేసింది. తాము అభివృద్ధి చేసిన కరొనిల్ ఔషధాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ధ్రువీకరించిందని పతంజలి సంస్థ చెప్పడాన్ని తప్పుబట్టింది.
దీనిపై వివరణ ఇవ్వాలని ఈ ఔషధ ఆవిష్కార కార్యక్రమానికి హాజరైన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ను కోరింది. ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో ఉండి ఒక తప్పుడు, అశాస్త్రీయమైన వస్తువును ఎలా ప్రజల కోసం విడుదల చేస్తారు? కరోనాను ఎదుర్కొనే ఔషధం అని చెప్పేందుకు దీనిపై జరిగిన క్లినికల్ ట్రయల్స్ గురించి వివరిస్తారా? మంత్రి నుంచి దేశ ప్రజలకు వివరణ కావాలి. దీనిని సుమోటోగా తీసుకోవాలని జాతీయ వైద్య మండలికి మేము లేఖ రాశాం. కరొనిల్ను డబ్ల్యూహెచ్ఓ ధ్రువీకరించిందన్న విషయాన్ని తెలుసుకుని మేం ఆశ్చర్యానికి గురయ్యాం అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది.
కాగా, ఫిబ్రవరి 19న ఈ కరొనిల్ టాబ్లెట్ ను బాబా రామ్ దేవ్ ఆవిష్కరించారు. తమ సంస్థ విడుదల చేస్తున్న ఈ ఔషధానికి డబ్ల్యూహెచ్ఏ ధ్రువీకరణ స్కీమ్లో భాగంగా కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకు చెందిన ఆయుష్ విభాగం ఆమోదించిందని చెప్పారు. అయితే కొవిడ్కు సంబంధించి ఎలాంటి సంప్రదాయ ఔషధాలను తాము అనుమతి ఇవ్వలేదని ట్విట్టర్ వేదికగా డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.
మరోవైపు, కరొనిల్ ఔషధం విషయంలో నెలకొన్న ఈ అనిశ్చితిపై పతంజలి ఎండీ బాలకృష్ణ ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. డబ్ల్యూహెచ్ఓ ఎలాంటి ఔషధాలకు అనుమతి ఇవ్వదని తెలిపారు. ప్రజలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించేందుకు డబ్ల్యూహెచ్ఓ కృషి చేస్తుందని తెలిపారు.