మారటోరియం పొడిగింపుపై గుడ్ న్యూస్ చెబుతారా!
కరోనా దెబ్బకి కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. భారీ సంఖ్యలో ఉద్యోగాలూ ఊడాయి. కొన్ని సంస్థలు 50, 70, 80 శాతం జీతాలు మాత్రమే చెల్లిస్తున్నాయి. ఇక, వ్యాపారాలు కూడా ఆశాజనకంగా సాగడం లేదు. దీంతో ఆర్థిక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మారటోరియం (అప్పు వాయిదా పద్ధతి)ని ప్రవేశపెట్టింది. అంటే ఈఎంఐల చెల్లింపు నుంచి తాత్కాలిక ఉపశమనం కల్పించింది. దీనిపై రకరకాల విమర్శలు ఉన్నా.. ఇది ఉద్యోగులకు, వేతన జీవులకు ఉపయోగపడింది. మొదట 3 నెలలు మారటోరియం ప్రకటించిన ఆర్బీఐ.. ఆ తర్వాత మళ్లీ పొడిగిస్తూ వచ్చింది. కానీ, మారటోరియం పొడిగింపుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి బ్యాంకులు.
రుణాల పునర్వ్యవస్థీకరణపై ఆర్బీఐతో చర్చలు:
కాగా, రుణాల చెల్లింపులపై మారటోరియం లేదా రుణాల పునర్వ్యవస్థీకరణ (restructuring loans) పొడిగింపుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో చర్చిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శుక్రవారం(జూలై 31,2020) వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్మల మాట్లాడారు. ‘కరోనా ప్రభావంతో కుదేలైన పరిశ్రమకు ఊతమిచ్చేలా రుణాల పునర్వ్యవస్థీకరణపై ఆర్బీఐతో చర్చిస్తున్నాం’ అన్నారు. ముఖ్యంగా ఆతిథ్య రంగం(hospitality sector) అవసరాలను అర్థం చేసుకున్నామని, వారి డిమాండ్ మేరకు మారటోరియం పొడిగింపుపై సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.
ఆగస్టు 31తో ముగిసిన మారటోరియం వెసులుబాటు:
కొవిడ్-19 దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన నేపథ్యంలో ఆర్బీఐ 6 నెలలపాటు మారటోరియం వెసులుబాటును కల్పించిన విషయం తెలిసిందే. ఆగస్టు 31తో ఇది ముగిసింది. వాస్తవానికి తొలుత మార్చి-మే నెలలకే మారటోరియం అవకాశాన్నిచ్చిన ఆర్బీఐ.. కరోనా ప్రభావ తీవ్రత దృష్ట్యా మరో 3 నెలలు పొడిగించింది. ఆరోగ్య సంరక్షణ, ఇతర ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుందన్నారు.
పెంచాల్సిన అవసరం లేదు: ఎస్బీఐ
కాగా, మారటోరియం గడువును పెంచాల్సిన అవసరం లేదని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ రజ్నీశ్ కుమార్ అన్నారు. ఆగస్టు 31 తర్వాత మారటోరియంను కొనసాగించనక్కర్లేదని ఎస్బీఐ సహా చాలా బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. ‘ఆరు నెలలపాటు రుణాలపై చెల్లింపులను వాయిదా వేసింది చాలు’ అని శుక్రవారం రజ్నీశ్ అన్నారు. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ ఆగస్టు తర్వాత మారటోరియంను పొడిగించవద్దని ఆర్బీఐ గవర్నర్ దాస్కు విజ్ఞప్తి చేసినది విదితమే. రుణాలను చెల్లించే స్థోమత ఉన్నవారూ మారటోరియం సాకుతో చెల్లించడం లేదని చెప్పుకొచ్చారు. ఈ పరిణామం మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థకే ప్రమాదమని గుర్తుచేశారు.
మారటోరియం పేరుతో తప్పించుకంటున్నారు: HDFC
లాక్డౌన్కు స్వస్తి చెప్పి ప్రభుత్వం అన్లాక్కు వెళ్లిపోవడంతో.. ప్రస్తుతం అనేకమంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని, అయినప్పటికీ మారటోరియం కారణంగా ఈఎంఐలు చెల్లించడం లేదని ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లారు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ దీపక్ పారెక్. ఇకపై మారటోరియంను పొడిగించవద్దని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్కు విజ్ఞప్తి చేసిన దీపక్ పారెక్.. ఈఎంఐలు కట్టే వెసులుబాటు ఉన్నవారు సైతం.. మారటోరియం సాకుతో తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలు, వ్యక్తిగత రుణగ్రహీతలు, ప్రతీ ఒక్కరూ మారటోరియం కారణంగా ఈఎంఐల చెల్లింపులు వాయిదా వేస్తే.. అది బ్యాంకింగ్ రంగాన్నే దెబ్బతీస్తుందన్నారు.