Happy Hypoxia: కరోనాతో యువతే ఎక్కువగా నష్టపోవడానికి కారణం
వయో వృద్ధులు, శ్వాస కోశ సమస్యలు ఉన్న వారు మాత్రమే కొవిడ్ ప్రభావానికి ప్రాణాలు కోల్పోయేవారు. ఇప్పుడు అలా లేదు ఈ సెకండ్ వేవ్ యువతలోనే ఎక్కువగా కనపడుతుంది.
Happy Hypoxia: వయో వృద్ధులు, శ్వాస కోశ సమస్యలు ఉన్న వారు మాత్రమే కొవిడ్ ప్రభావానికి ప్రాణాలు కోల్పోయేవారు. ఇప్పుడు అలా లేదు ఈ సెకండ్ వేవ్ యువతలోనే ఎక్కువగా కనపడుతుంది. అప్పటివరకూ మామూలుగానే ఉండి ఒక్కసారిగా నష్టపరుస్తుంది. దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
కరోనా రెండో దశ యువతను ఎక్కువగా బలి తీసుకుంటోంది. స్వల్ప లక్షణాలే ఉండి అప్పటివరకు చూడటానికి ఆరోగ్యంగా, చలాకీగా ఉన్నవారూ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది మరణానికి కారణం ‘హ్యాపీ హైపోక్సియా’. వైద్య పరిభాషలో ‘సైలెంట్ హైపోక్సియా’గా కూడా పిలిచే ఈ లక్షణం నిజంగానే ఓ సైలెంట్ కిల్లర్.
కరోనా మొదటి దశలో హ్యాపీ హైపోక్సియా అనే సమస్య ఉన్నవారు ఆక్సిజన్ శాతం 98 ఉన్నప్పుడు ఎలా ఉండేవారో, 90కి పడిపోయినప్పుడూ అలాగే ఉండేవారు. ఇప్పుడు 80-85 శాతం కంటే పడిపోయినా సాధారణంగానే ఉంటున్నారు. వారిలో వ్యాధి లక్షణాలూ పెద్దగా కనిపించడం లేదు. హఠాత్తుగా నష్టం జరుగుతోంది.
కాబట్టి కరోనా సోకినవాళ్లు వ్యాధి లక్షణాల కంటే పల్స్ ఆక్సీమీటర్పైనే ఎక్కువ ఆధారపడటమే బెటర్. ప్రస్తుతం ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉండటంతో 85-90 శాతానికి పడిపోయినవారిని చేర్చుకోవడానికి ఆసుపత్రులూ భయపడుతున్నాయి.
కొందరిలో అప్పటికి ఆక్సిజన్ శాతం సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ చూస్తుండగానే పడిపోతోంది. 72 గంటల్లో పరిస్థితి చేయిదాటిపోతోంది. కరోనా వల్ల ఇలా జరుగుతోంది. లోగడ ఆక్సిజన్ శాతం కాస్త తగ్గితే హోం ఐసొలేషన్లో ఉండి చికిత్స తీసుకోమనేవారు. ఇప్పుడు సీటీస్కాన్ పర్సంటేజీని బట్టి ఇంట్లో ఉండాలో, ఆసుపత్రిలో చేరాలో వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం హ్యాపీహైపోక్సియా యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. మరణాలూ వారిలో ఎక్కువ ఉంటున్నాయి.
హ్యాపీ హైపోక్సియాకు 2 ప్రధాన కారణాలున్నాయని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. వైరస్ కలిగించే ఇన్ఫ్లమేషన్ రియాక్షన్ వల్ల ఊపిరితిత్తుల నుంచి రక్తం సరఫరా చేసే సన్నటి రక్తనాళాల్లోను గడ్డలు ఏర్పడుతున్నాయి. ఊపిరితిత్తులు దెబ్బతినడం, రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటంతో ఆక్సిజన్ శోషించుకునే గుణం తగ్గుతోంది. మెదడుకు అవసరమైనంత రక్తం సరఫరా కాదు. బృహత్ ధమనికిపైన ఉండే కరోటిడ్ బాడీస్ను వైరస్ దెబ్బతీయడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిందని రోగి గ్రహించలేడు.
మరో కారణం.. రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు దాన్ని గాలి నుంచి ఎక్కువగా గ్రహించేందుకు మనిషి అసంకల్పితంగానే ఎక్కువసార్లు ఊపిరి తీసుకుంటాడు. ఆ క్రమంలో రక్తంలో ఉండే కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా బయటకు వెళ్లిపోతుంది. సాధారణంగా రక్తంలో కార్బన్ డై ఆక్సైడ్ 40 మిల్లీమోల్స్ ఉండాలి. మనిషి మెదడులో శ్వాసకోశ వ్యవస్థను నియంత్రించే భాగాన్ని స్టిమ్యులేట్ చేసేది Co2నే. ఉండాల్సిన దానికంటే తగ్గిపోవడం వల్ల, మనిషి మెదడులో స్టిమ్యులేషన్ జరగక ఆక్సిజన్ శాతం తగ్గిన విషయాన్ని రోగి గ్రహించలేడు.
హ్యాపీ హైపోక్సియా లక్షణాలు: కరోనా సోకినా జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. బాధితులమన్నదే తెలియకపోవచ్చు. టాయిలెట్కు వెళ్లినప్పుడు ఆయాసంగా అనిపించడం, పెదవులు నీలం రంగులోకి మారడం, చల్లటి వాతావరణంలోనూ చెమటలు పట్టడం వంటివి హ్యాపీ హైపోక్సియా లక్షణాలు. ప్రస్తుతం కరోనా ఉద్ధృతంగా ఉన్నందున ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.