Uttar Pradesh Politics : పేర్లు గందరగోళం…మరో పెర్ఫ్యూమ్ వ్యాపారి ఇంట్లో ఐటీ సోదాలు
గత వారం ఐటీ అధికారులు దాడులు చేసిన వ్యాపారి పేరు పీయూష్ జైన్ అయితే.... ఈ రోజు దాడులు జరుగుతున్న వ్యాపారి పేరు పుష్పరాజ్ జైన్ అలియాస్ పంపీ జైన్. పేర్ల గందర గోళంలోనే గతంలో పీయూష్
Uttar Pradesh Politics : అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నవేళ ఉత్తర ప్రదేశ్లో ఆదాయపన్ను శాఖ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే కాన్పూరుకు చెందిన పెర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఆదాయ పన్ను శాఖ అధికారులు నేడు మరోక పెర్ఫ్యూమ్ వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా ఇద్దరి పేర్లు ఒకే రకంగా ఉండటం ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
గత వారం ఐటీ అధికారులు దాడులు చేసిన వ్యాపారి పేరు పీయూష్ జైన్ అయితే…. ఈ రోజు దాడులు జరుగుతున్న వ్యాపారి పేరు పుష్పరాజ్ జైన్ అలియాస్ పంపీ జైన్. పేర్ల గందర గోళంలోనే గతంలో పీయూష్ జైన్ ఇంట్లో దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో తాజా తనిఖీలు చర్చనీయాంశంగా మారాయి.
ఈరోజు ఉదయం ముంబైకి చెందిన ఆదాయపన్ను శాఖ అధికారులు కన్నౌజ్లోని పుష్పరాజ్ జైన్ ఇంట్లో సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేతకు సంబంధించి ఈ తనిఖీలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులపై సమాజ్వాది పార్టీ ట్విట్టర్ లో స్పందించింది. భారీ వైఫల్యం తర్వాత ఎట్టకేలకు ఆదాయపన్నుశాఖ అధికారులు..కన్నౌజ్ లోని పుష్పరాజ్ ఇంటితో పాటు ఇతర పెర్ఫ్యూమ్ వ్యాపారుల ఇళ్లపై దాడులు చేపట్టింది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సమయంలో బీజేపీ ఇలా కేంద్ర దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేయటం సర్వ సాధారణమేనని ట్వీట్ చేసింది. అయితే ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని. వీటికి తమ ఓటుతో సమాధానం చెబుతారని సమాజ్ వాది పార్టీ విమర్శించింది.
Also Read : Covid Vaccine : వ్యాక్సిన్ వేయించుకోవటం వల్ల ఆసుపత్రిలో చేరే అవసరం తగ్గుతుంది-ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్
పుష్పరాజ్ ఇటీవలే సమాజ్వాదీ పార్టీ పేరుతో ఒక పెర్ఫ్యూమ్ను తయారు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ తరుఫున పోటీ చేసే అవకాశం కూడా ఉంది. పీయూష్ జైన్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసినప్పటి నుంచి అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్ వాది పార్టీల మధ్య మాటలు యుధ్ధం జరుగుతోంది.
తాజా పరిణామాలపై ఎస్పీ నేత మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.మంగళవారం కాన్పూర్లో జరిగిన ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐటీ దాడులు, నగదు స్వాధీనంపై సమాజ్వాదీ పార్టీని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. 2017కి ముందు ఉత్తరప్రదేశ్ అంతటా చల్లిన అవినీతి అత్తరు ప్రతి ఒక్కరికీ అంటిందని అన్నారు.