India Lockdown : మే 3 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్.. నిజం ఏంటంటే..

కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని, మే 3 నుంచి దేశవ్యాప్తంగా మరోసారి పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధిస్తుందని గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది.

India Lockdown : మే 3 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్.. నిజం ఏంటంటే..

India Lockdown

India Lockdown : కరోనావైరస్ మన దేశంపై దండయాత్ర చేస్తోంది. సునామీలా విరుచుకుపడుతోంది. కొన్ని రోజులుగా రోజూ రికార్డు స్థాయిలో లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మే నెలలో కరోనా విలయం మరింత తీవ్రంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని, మే 3 నుంచి దేశవ్యాప్తంగా మరోసారి పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధిస్తుందని గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది. ఆ ప్రచారం ఫేక్ అని చెప్పింది. ఆ వదంతులను కొట్టిపారేసింది. ఈ మేరకు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్‌ చెక్‌ చేసి స్పష్టతనిచ్చింది.

‘‘మే 2న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత 3వ తేదీ నుంచి మే 20 వరకు దేశంలో పూర్తి లాక్‌డౌన్‌ విధించనున్నారంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అయ్యాయి. కానీ, ఆ పోస్టులు పూర్తిగా అవాస్తవం. కేంద ప్రభుత్వం అలాంటి ప్రకటనేమీ చేయలేదు’’ అని పీఐబీ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఏప్రిల్ 20న ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. లాక్‌డౌన్‌ చివరి అంశం కావాలని అన్నారు. ఆ తర్వాత నుంచి సోషల్‌ మీడియాలో దీనిపై ప్రచారం మొదలైంది. మే 3 నుంచి లాక్‌డౌన్‌ పెట్టనున్నారని ఓ టీవీ ఛానల్‌ ప్రసారం చేసినట్లుగా ఉన్న పోస్టులు ఇటీవల వైరల్‌ అయ్యాయి. అయితే తాము అలాంటి వార్తలేమీ ప్రసారం చేయలేదని సదరు టీవీ ఛానల్‌ వివరణ ఇచ్చింది.

లాక్‌డౌన్‌ అవసరం ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. గత గురువారం కేంద్ర హోంశాఖ స్పందిస్తూ.. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. మే 31 వరకు కరోనా ఆంక్షలను అమలు చేయాలని స్పష్టం చేసింది. లాక్ డౌన్ అవసరం లేదని కేంద్రం పదే పదే చెబుతున్నా.. పుకార్లు మాత్రం ఆగడం లేదు. లాక్ డౌన్ గురించి రోజుకో ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. పీఐబీ ఇచ్చిన క్లారిటీ తర్వాత అయినా ఈ ప్రచారానికి తెర పడుతుందో లేదో చూడాలి.

దేశంలో కరోనా ఉగ్రరూపం..4లక్షలు దాటిన రోజువారీ కేసులు:
కాగా, దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. మునుపెన్నడూ లేనంత ఉద్ధృతితో వైరస్ వ్యాపిస్తుండటంతో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 4లక్షలు దాటాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో ఇన్ని అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అదీ భారత్‌లోనే చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. అటు వరుసగా నాలుగో రోజు 3వేల మందికి పైనే కరోనాతో మృత్యువాతపడ్డారు.

24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 19,45,299 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4,01,993 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.91కోట్లకు చేరింది. ఇదే సమయంలో మరో 3వేల 523 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్‌ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 2,11,853 మందిని కొవిడ్‌ బలితీసుకుంది. మరణాల రేటు 1.11శాతంగా ఉంది. అయితే కొత్త కేసులతో పాటు రికవరీలు కూడా ఎక్కువగానే ఉంటుండం కాస్త సానుకూల పరిణామం. గడిచిన 24 గంటల్లో దాదాపు 3లక్షల(2,99,988) మంది కరోనాను జయించారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1.56కోట్లకు చేరగా.. రికవరీ రేటు 81.84శాతంగా ఉంది.

ఇక కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు 32లక్షలు దాటాయి. ప్రస్తుతం 32,68,710 మంది వైరస్‌కు చికిత్స తీసుకుంటుండగా.. క్రియాశీల రేటు 17.06 శాతానికి పెరిగింది. దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. శుక్రవారం మరో 27లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వగా.. ఇప్పటివరకు 15.49కోట్ల మంది టీకా పొందారు.