కరోనా టెన్షన్…మోడీ బ్రసెల్స్ పర్యటన రద్దు

  • Published By: venkaiahnaidu ,Published On : March 5, 2020 / 12:15 PM IST
కరోనా టెన్షన్…మోడీ బ్రసెల్స్ పర్యటన రద్దు

ప్రపంచంలోని 50దేశాలకు కరోనా వైరస్ ఇప్పటికే విస్తరించింది. ప్రపంచదేశాలపై కరోనా విజృంభణ కొనసాగుతున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన రద్దు అయింది. మార్చి 13న ఇండియా-యూరోపియన్ యూనియన్ సమ్మిట్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టాల్సిన బ్రసెల్స్‌ పర్యటన రద్దయింది.

హెల్త్ అధికారుల సలహాల మేరకు భారత్-ఈయూ ఇద్దరూ పర్యటన వాయిదాకు అంగీకారం తెలిపారని,సమ్మిట్ ను తదుపరికి వాయిదా వేయడం తెలివైన పని అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ గురువారం(మార్చి-5,2020)తెలిపారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం  మార్చి 13న బ్రసెల్స్‌ లోని ఈయూ కార్యాలయంలో ఇండియా-ఈయూ సదస్సు జరగాల్సి ఉంది.

బ్రసెల్స్‌లో బుధవారం పది కరోనా వైరస్‌ కేసులు కొత్తగా వెలుగుచూడటంతో బెల్జియంలో కరోనా కేసుల సంఖ్య 23కు చేరుకుంది. ఈయూ, భారత్‌ల మధ్య సన్నిహిత సహకార బంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే ఈ వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని ఆశిస్తున్నామని రవీష్‌ కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈయూ సభ్య దేశాలతో సంప్రదింపుల అనంతరం తదుపరి తేదీలను వెల్లడిస్తారని రవీష్‌ కుమార్‌ తెలిపారు. కాగా ప్రధాని మోడీ బంగ్లాదేశ్‌ పర్యటన షెడ్యూల్‌కు అనుగుణంగా జరుగుతుందని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని రవీష్ తెలిపారు.