పుల్వామా దాడిపై ఆధారాలు ఇచ్చిన భారత్..పాత పాట పాడిన పాక్
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి భారత్ అందించిన ఆధారాలపై పాకిస్తాన్ స్పందించిన తీరుపై భారత విదేశాంగ కార్యాలయం అసహనం వ్యక్తం చేసింది.పాక్ పాత పాటే పాడడం తీవ్ర నిరాశకు గురిచేసిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ శుక్రవారం(మార్చి-29,2019) ఓ ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదంపై మొదటి నుంచి పాక్ దుర్నీతిని ప్రదర్శిస్తుందని..ఇలాంటి సందర్భంలో పాక్ సమాధానం తమను పెద్దగా ఆశ్చర్యానికి గురిచేయలేదన్నారు.
పుల్వామా ఉగ్రదాడి వెనక జైషే మహ్మద్ ఉగ్రసంస్థ హస్తం ఉందంటూ భారత్.. పాక్ కు స్పష్టమైన ఆధారాలను సమర్పించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పాక్.. భారత్ చెప్పిన చోట అసలు ఎలాంటి శిబిరాలు లేవని చెప్పుకొచ్చింది. అలాగే ఈ దాడులతో జైషే చీఫ్ మసూద్ అజార్కు సంబంధం ఉన్నట్లు సరైన ఆధారాలు లేవని వాదించింది.