Agni Prime : అగ్ని ప్రైమ్ మిసైల్ ప్రయోగం విజయవంతం
అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ మిసైల్ ను సోమవారం ఒడిశా తీరంలో భారత్ విజయవంతంగా పరీక్షించింది.
Agni Prime అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ మిసైల్ ను సోమవారం ఒడిశా తీరంలో భారత్ విజయవంతంగా పరీక్షించింది. భువనేశ్వర్ కి 150 కిలోమీటర్ల దూరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ఐలాండ్ లోని టెస్టింగ్ ఫెసిలిటీ నుంచి ఉదయం 10:55గంటల సమయంలో అగ్ని మిస్సైల్ సిరీస్లో భాగమైన అగ్ని ప్రైమ్ ను డీఆర్డీవో ప్రయోగించింది. ఈ క్షిపణి అనుకున్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో చేరకుందని డీఆర్డీవో అధికారులు తెలిపారు. తూర్పు తీరం వెంబడి ఉన్న వివిధ టెలిమెట్రీ, రాడార్ స్టేషన్లు క్షిపణి ప్రయోగాన్ని సమర్థవంతంగా పర్యవేక్షించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది.
కాగా, అగ్ని ప్రైమ్ క్షిపణి.. వాస్తవానికి రెండు ప్రధాన క్షిపణుల శక్తిసామర్థ్యాల కలయిక. దీంట్లో ఎన్నో అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయి. ప్రధానంగా అగ్ని ప్రైమ్ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్. అగ్ని క్షిపణి సిరీస్లో కొత్త తరానికి చెందిన అగ్నిప్రైమ్ 1000-2000 కిలోమీటర్ల మధ్య శ్రేణి సామర్థ్యంతో దూసుకెళ్లనుంది. అగ్ని-1 సింగిల్ స్టేజ్ మిస్సైల్ కాగా.. అగ్ని ప్రైమ్లో రెండు స్టేజీలు ఉన్నాయి. కొత్త టెక్నాలజీతో అగ్ని ప్రైమ్ క్షిపణిని నిర్మించారు. దీంతో దీని బరువు గత అగ్ని వెర్షన్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. ఇక, అగ్ని-1 బలాస్టిక్ మిస్సైల్ను ఇండియాలో తొలిసారి 11989లో పరీక్షించారు. 2004లో ఆ క్షిపణులను వినియోగంలోకి తెచ్చారు.