కెనడా హైకమిషనర్ కు భారత్ సమన్లు

కెనడా హైకమిషనర్ కు భారత్ సమన్లు

India summons Canadian High Commissioner ఢిల్లీలో జరుగుతోన్న రైతుల నిరసనలపై సోమవారం కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో,ఇతర ఎంపీలు,మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన భారత్ శుక్రవారం(డిసెంబర్-4,2020) ఆ దేశ హైకమిషనర్​ కు సమన్లు జారీ చేసింది. అలాంటి చర్యలు కొనసాగితే.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని భారత్ హెచ్చరించింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం ఆమోద యోగ్యం కాదని భారత్ స్పష్టం చేసింది.



కెనడా హైకమిషనర్​ కు ఇవాళ సమన్లు జారీ చేశాం. భారతీయ రైతులకు సంబంధించిన సమస్యలపై కెనడా ప్రధాని, కొందరు కేబినెట్​ మంత్రులు, పార్లమెంట్​ సభ్యులు చేసిన వ్యాఖ్యలు ఆమోద యోగ్యం కాదని తెలియజేశాం.అలాంటి చర్యలు కొనసాగితే..ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించాం. కెనడా నాయకులు చేసిన వ్యాఖ్యలు.. అక్కడి భారత హైకమిషన్​, కాన్సులేట్​ ముందు ఉగ్రవాద కార్యకలాపాలకు దారితీసే ప్రమాదం ఉంది. దాంతో భద్రత సమస్యలు తలెత్తుతాయి. భారతీయ హైకమిషన్​ అధికారులకు కెనడా ప్రభుత్వం పూర్తిస్థాయి భద్రత కల్పిస్తుందని భావిస్తున్నాం. ఉగ్రకార్యకలాపాలను రెచ్చగొట్టే చర్యలకు వారి రాజకీయ నేతలు దూరంగా ఉండాలి అని భారత విదేశాంగ శాఖ తెలిపింది.



కాగా, సోమవారం(నవంబర్-30)గురునానక్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో మాట్లాడుతూ…భారత్​లో జరుగుతోన్న రైతుల ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. శాంతియుత నిరసనలకు కెనడా ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని తెలిపారు. అలాగే.. భారత్​ లో తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలపై స్పందించిన మొదటి విదేశీ నాయకుడు ట్రూడోనే. భారత రైతుల ఆందోళనలపై కెనడా రక్షణ మంత్రి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భారత్​ వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.