చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడిన అజిత్ దోవల్… LAC వెంట దళాల ఉపసంహరణకు అంగీకారం
తూర్పు లడఖ్లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)దగ్గర యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారుడు( అజిత్ ధోవల్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఫోన్లో మాట్లాడారు. సంపూర్ణ స్థాయిలో శాంతి, సామరస్యం విలసిల్లాలన్న లక్ష్యంతో చైనా విదేశాంగ మంత్రితో అజిత్ ధోవల్ మాట్లాడారు.
ఆదివారం ఇద్దరూ వీడియో కాల్ ద్వారా సరిహద్దు సమస్యపై చర్చించినట్లు తెలుస్తున్నది. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించాలన్న నేపథ్యంలో ఇద్దరూ సంభాషించారు. చర్చలు చాలా సానుకూలంగా సాగినట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో మళ్లీ గాల్వన్ లాంటి ఘర్షణలు పునరావృత్తం కాకూడదని ఇద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం.
రెండు దేశాల సైన్యాలు వివాదాస్పద ప్రాంతం నుంచి వైదొలుగుతున్నట్లు ఇవాళ చైనా విదేశాంగ ప్రతినిధి జావోలిజియాన్ కూడా తెలిపారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు.. ఫ్రంట్లైన్ దళాలను ఉపసంహరించడానికి కావాల్సిన అన్ని చర్యలను చేపట్టినట్లు ఆయన తెలిపారు. మూడవసారి జరిగిన కమాండర్ స్థాయి చర్చల్లో కుదిరిన ఒప్పందాల ప్రకారం దళాల ఉపసంహరణ జరుగుతున్నట్లు జావో లిజియాన్ తెలిపారు.
ఎల్ఏసీ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర వెనక్కి చైనా దళాలు వెళ్లినట్లు భారత సైన్యం ప్రకటించిన వెంటనే చైనా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఫ్రంట్లైన్ దళాల ఉపసంహరణలో పురోగతి సాధించినట్లు జావో లిజియాన్ తెలిపారు. దీంతో ఉద్రిక్తతలను కూడా తగ్గనున్నట్లు ఆయన తెలిపారు.
గత ఏడు వారాలుగా, తూర్పు లడఖ్లోని పలు చోట్ల భారత- చైనా సైన్యాల మధ్య ఘోరమైన ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. గల్వాన్ వ్యాలీలో 20 మంది సైనికులు అమరవీరులైన తర్వాత భారత్- చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చైనా వైపు కూడా ప్రాణనష్టం జరిగింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరువర్గాల మధ్య గత కొన్ని వారాలలో అనేక దౌత్య మరియు సైనిక చర్చలు జరిగాయి.
Read Here>>కరోనా, జీ4 కన్నా డేంజర్.. చైనాని వణికిస్తున్న కొత్త రోగం బుబోనిక్ ప్లేగ్, 24 గంటల్లో మరణం