ఇండియా vs కరోనా వైరస్ : మార్చి 31వరకు ప్రజారవాణా బంద్…లాక్ డౌన్ లో 75జిల్లాలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 22, 2020 / 11:17 AM IST
ఇండియా vs కరోనా వైరస్ : మార్చి 31వరకు ప్రజారవాణా బంద్…లాక్ డౌన్ లో 75జిల్లాలు

దేశ‌వ్యాప్తంగా 75 జిల్లాల‌ను లాక్‌ డౌన్ అవుతున్నాయి. కరోనా(కోవిడ్ 19) పాజిటివ్ కేసులు న‌మోదు అయిన జిల్లాల్లో పూర్తి నిషేధ ఆజ్ఞ‌లు అమ‌లు చేయ‌నున్నారు.  ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యానికి చెందిన క్యాబినెట్ సెక్ర‌ట‌రీ, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీలు ఇవాళ అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్ర‌ట‌రీల‌తో ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఆ స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.  

దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 7కి చేరుకున్న‌ది. ఇవాళ  ఒక్కొరోజే ముగ్గురు మ‌ర‌ణించారు. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు దేశ‌వ్యాప్తంగా జ‌న‌తా క‌ర్ఫ్యూ ప్ర‌జ‌లు పాటిస్తున్నారు. భార‌త్‌ లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 341కి చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇటలీలోని రోమ్ నుంచి వ‌చ్చిన విమానం ఇవాళ ఉద‌యం ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఆ విమానంలో 263 మంది భార‌తీయ విద్యార్థులు ఉన్నారు.  విద్యార్థుల‌ను అంద‌ర్నీ ఐటీబీపీ చావ్లా క్వారెంటైన్ సెంట‌ర్‌కు తీసుకువెళ్లారు.  థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్‌, ఇమ్మిగ్రేష‌న్ చెక్ చేశారు. ఆ విమానంలో ఉన్న సిబ్బందికి కూడా క్వారెంటైన్ ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు దేశవ్యాప్తంగా షట్ డౌన్ దిశగా కొనసాగుతోంది. మార్చి-31వరకు దేశవ్యాప్తంగా ప్యాసింజర్ రైళ్లను నిలిపివేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.ఇక దేశవ్యప్తంగా అన్ని రాష్ట్రాల్లో…మెట్రోలు,అంతరాష్ట్ర బస్సు సర్వీసులను కూడా మార్చి-31వరకు నిలిపివేయబడ్డాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా రద్దు అయ్యాయి.