చైనాతో ఆ రోజు యుద్ధం జరిగుండేదే
India,China తూర్పు లడఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో భారత్- చైనా మధ్య తొమ్మిది నెలల పాటు ఏర్పడిన ప్రతిష్టంభన నెమ్మదిగా తొలగుతోంది. ఇరువైపులా బలగాల ఉపసంహరణ వేగంగా సాగుతోంది. అయితే ఈ సమయంలో ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో ఒకానొక దశలో చైనాతో యుద్ధం అంచుల వరకు భారత్ వెళ్లిందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ వైకే జోషీ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే యుద్ధానికి దారితీయకుండా భారత్ చాకచక్యంగా చైనాను నిలువరించిందని తెలిపారు.
తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడిన వైకే జోషీ .. ఇరు దేశాల సరిహద్దుల్లో గతేడాది ఆగస్టులో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను వివరించారు. జులైలో గల్వాన్ లోయలో ఘర్షణ జరిగిన తర్వాత ఇరుదేశాల మధ్య ఎర్రగీత గీయాల్సి వచ్చింది. ఆగస్టు 29, 30 మధ్యరాత్రి భారత్ పాంగాంగ్ సరస్సుకు దక్షిణాన వ్యూహాత్మకంగా కీలకమైన కైలాశ్ రేంజ్ను అధీనంలోకి తీసుకుంది.
ఈ ఆకస్మిక చర్యతో చైనా కంగుతింది. అయితే ప్రతిచర్యకు దిగింది. ఆగస్టు 31న కైలాశ్ రేంజ్ సమీపంలోకి రావాలని ప్రయత్నించింది. దీంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. మా ట్యాంకు మన్, గన్నర్ సహా అందరూ పరిస్థితులను గమనిస్తున్నారు. శత్రవుల యుద్ధ ట్యాంక్ అత్యంత సమీపంగా రావడంతో వారంతా అప్రమత్తమయ్యారు.
ఆ సమయంలో ట్రిగ్గర్ నొక్కి యుద్ధం ప్రారంభించడం చాలా సులువే. ఎందుకంటే పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి ఆపరేషన్లయినా చేపట్టేందుకు మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కానీ, చైనా దళాలపై కాల్పులు జరపకుండానే ఎదుర్కోవడం చాలా సహనంతో కూడిన క్లిష్టమైన పని. దానికి చాలా ధైర్యం, నిబద్ధత కావాలి. మన జవాన్లు అలానే వ్యవహరించారు. యుద్ధం జోలికి వెళ్లకుండా చైనాను నిలువరించగలిగాం. కానీ, ఆ సమయంలో భారత్ దాదాపు యుద్ధం అంచుల వరకు వెళ్లిందని వైకే జోషి తెలిపారు.
సరిహద్దుల్లో రెచ్చగొట్టి కయ్యానికి కాలు దువ్విన డ్రాగన్కు ఈ ప్రతిష్టంభనతో చెడ్డ పేరు తప్ప ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు. భారత్ ఆకస్మిక చర్యలు చైనాను గందరగోళానికి గురిచేశాయని, నియంత్రణ రేఖ వద్ద ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయిందని చెప్పారు. సరిహద్దుల్లో యథాతథస్థితిని మార్చేందుకు భారత్ ఎప్పటికీ అంగీకరించబోదని డ్రాగన్కు బాగా అర్థమైందన్నారు.
ఈ సందర్భంగా గల్వాన్ లోయలో ఘర్షణల గురించి కూడా జోషీ ప్రస్తావించారు. ఆ ఘర్షణల్లో చైనా వైపు చాలా మందే సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారన్నారు. 45 లేదా అంతకంటే ఎక్కువ మందే మృతిచెంది ఉండొచ్చని అంచనావేశారు.