చైనా కవ్వింపులతో బోర్డర్ లో టెన్షన్…లఢఖ్ లో ఆర్మీ చీఫ్

  • Published By: venkaiahnaidu ,Published On : May 23, 2020 / 09:53 AM IST
చైనా కవ్వింపులతో బోర్డర్ లో టెన్షన్…లఢఖ్ లో ఆర్మీ చీఫ్

దేశంలో ఓ వైపు కరోనా విజృంభణ కొనసాగుతున్న సమయంలో భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. చైనాతో జరిగిన ఐదో విడత చర్చలు కూడా విఫలమైన నేపథ్యంలో ఇరు దేశాలూ భారీగా బలగాలను మోహరిస్తున్నాయి. దీంతో తాజా పరిస్ధితిని సమీక్షించేందుకు ఇండియన్ ఆర్మీఛీఫ్ నరవణే లడఖ్ లో పర్యటిస్తున్నారు. సరిహద్దుల్లో తాజా పరిస్ధితిపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఇవాళ ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఎంఎం న‌ర‌వాణే.. లేహ్‌లో ప‌ర్య‌టించారు. అక్క‌డి ప‌రిస్థితుల‌ను ఆయ‌న స్వ‌యంగా స‌మీక్షించారు. ఫీల్డ్ క‌మాండ‌ర్ల‌తో ప‌రిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. నార్త్ ఆర్మీ క‌మాండ‌ర్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ వైకే జోషి, 14 కార్ప‌ర్స్ చీఫ్ లెప్టినెంట్ జ‌న‌ర‌ల్ హ‌రింద‌ర్ సింగ్‌లు.. ఆర్మీ చీఫ్‌కు అక్క‌డ ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. వాస్తవానికి ప్రతీ సారీ ఆర్మీఛీఫ్ పర్యటన వివరాలను వెల్లడించే ప్రభుత్వం.. ఈసారి మాత్రం గోప్యంగా ఉంచింది. గ‌త నెల‌లో ల‌డాఖ్‌లోని పాన్‌గంగ్ లేక్‌తో పాటు సిక్కింలోని నియంత్ర‌ణ రేఖ దగ్గర కూడా చైనా సైనికుల‌ు మ‌న జ‌వాన్లపై దాడికి పాల్పడగా,భారత సైన్యం కూడా ధీటుగా జవాబుచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ పరిస్ధితి ఉద్రిక్తంగానే కనిపిస్తోంది. ఆధిపత్యం కోసం ఇరుదేశాలు సరిహద్దుల్లోకి అదనపు బలగాలను పంపుతున్నాయి.

కరోనా సంక్షోభాన్ని కూడా లెక్కచేయకుండా చైనా దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో లడఖ్ సెక్టార్ లో తాజా పరిస్దిని కేంద్రప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. వివాదాస్పద సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరుదేశాల సైనికాధికారుల మధ్య ఐదు రౌండ్ల చర్యలు జరిగినా ఫలితం లేకపోయింది. చర్చలు విఫలమైన నేపథ్యంలో ఉద్రిక్తతలను నివారించేందుకు ఆర్మీ ఛీఫ్ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. గతేడాది కేంద్ర ప్రభుత్వం చైనా సరిహద్దుల్లోని దేప్సాంగ్-గల్వాన్ లోయకు మధ్య 255 కిలోమీటర్ల పొడవైన డర్బుక్-షయాక్-డీబీవో రహదారి నిర్మాణం తలపెట్టింది. దీనిపై ఆగ్రహంగా ఉన్న చైనా బలగాలు కవ్వింపు చర్యలకు దిగుతున్న విషయం తెలిసిందే.

అంతేకాకుండా మరోవైపు కరోనా నేపథ్యంలో అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాలు చైనాపై గుర్రుగా ఉన్నాయి. కరోనా వైరస్ చైనా సృష్టేనని బహిరంగంగా విమర్శలెు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న అమెరికా,జపాన్ సహా పలు దేశాలకు చెందిన 1000కి పైగా కంపెనీలు కూడా డ్రాగన్ దేశాన్ని వదిలిపెట్టేందుకు రెడీ అయ్యాయి. సంస్థలు ఒకే చోట తమ కార్యకలాపాలను కేంద్రీకరించొద్దని భావిస్తున్నాయి. కరోనా తర్వాత చైనా వదలి తమ ఉత్పత్తి యూనిట్లను భారత్,వియత్నాం,తైవాన్,ఇండోనేషియా,మలేషియా వంటి వేశాలకు మార్చాలని ఆలోచన చేస్తున్నట్లు సమచారం. యూరోప్ దేశాలు కూడా చైనా నుంచి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. 

ఈ సమయంలో తమదేశంలో విదేశీ పెట్టుబడులు కాపాడుకునేందుకే సరిహద్దుల్లో అలజడులు సృష్టించే కార్యక్రమానికి కమ్యూనిస్ట్ దేశం కంకణం కట్టుకున్నట్లు అర్థమవుతోంది. పెట్టుబడులను తరలించడానికి ఆసియాలోని ఇతర మార్కెట్లు స్థిరంగా లేవు అని వ్యాపారవర్గాలకు తెలియజేయాలనే డ్రాగన్ దేశం సరిహద్దుల్లో పీపుల్ లిబరేషన్ ఆర్మీ(PLA)ని వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నెల రోజులుగా లఢఖ్,సిక్కిం రాష్ట్రాల్లోని సరిహద్దుల దగ్గర చైనా ఆర్మీ దూకుడును పెంచింది. దీంతో రెండు దేశాల సరిహద్దుల దగ్గర పరిస్థితులు సాధారణంగా లేవు.

Read: డీఎంకే ఎంపీ భారతి అరెస్ట్, విడుదల