పాక్,చైనాను ఎదుర్కొనేందుకు భారత మిలటరీ సిద్దంగా ఉండాలి : రావత్

పాక్,చైనాను ఎదుర్కొనేందుకు భారత మిలటరీ సిద్దంగా ఉండాలి : రావత్

Bipin Rawat ప్రపంచంలో ఏ దేశ సైన్యం ఎదుర్కోని సవాళ్లను భారత మిలటరీ ఎదుర్కొంటుందని త్రిదళాధిపతి(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. యుద్ధ స్వభావం మారిన నేపథ్యంలో ఇతర దేశాలు అలవరచుకున్న మార్పులను, పరివర్తనలను అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం సహా.. చైనా, పాక్​ల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉండాలని సూచించారు.

సికింద్రాబాద్‌లోని కాలేజ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ మేనేజ్ మెంట్(CDM) ఏర్పాటు చేసిన వెబినార్‌లో.. భారత సైన్యం ఎదుర్కొంటున్న సవాళ్లు-అత్యవసర చర్యలు అనే అంశంపై రావత్ మాట్లాడుతూ..భారత సైన్యం‌ ప్రస్తుతం తీవ్ర భద్రతా,సవాళ్లతో కూడిన వాతావరణాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా జాతీయ భద్రతా వ్యూహాలు, రక్షణశాఖ వ్యూహాత్మక మార్గదర్శకాలు, రక్షణశాఖలో నిర్మాణాత్మక సంస్కరణలను మరోసారి నిర్వచించుకోవాలని స్పష్టం చేశారు.

20వ శతాబ్దంలో సమాచార విప్లవం, సాంకేతిక పరిజ్ఞానం పెరిగి యుద్ధ స్వభావం పూర్తిగా మారిపోయిందని రావత్ అన్నారు. ఈ సమయంలో ఇదివరకెన్నడూ లేని విధంగా కొత్త సాధనాలు, వ్యూహాలను ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఈ సమయంలో దేశ అవసరాలకు అనుగుణంగా రక్షణ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరాన్ని రావత్‌ గుర్తుచేశారు. భారత్‌ చుట్టుపక్కల, హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తుందని.. ఈ నేపథ్యంలో చైనా, పాకిస్తాన్ ల నుంచి తలెత్తే సైనిక బెదిరింపులు, ముప్పులను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలని బిపిన్‌ రావత్‌ తెలిపారు.