రోజూ 500మందికి ఉచితంగా డయాలసిస్, భోజనం కూడా.. దేశంలోనే అతిపెద్ద కిడ్నీ ఆసుపత్రి ప్రారంభం

ఈ రోజుల్లో వైద్యం ఎంత కాస్ట్లీగా మారిందో తెలిసిందే. చిన్న చిన్న జబ్బులకే వందలు, వేలు ఖర్చు అవుతున్నాయి. అలాంటిది పెద్ద పెద్ద జబ్బులకు వైద్యం అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. పేదలు, మధ్య తరగతి వారిది అలాంటి పరిస్థితే. అలాంటి ఈ రోజుల్లోనూ ఉచితంగా చికిత్స చేయడంతో పాటు భోజన వసతి కూడా కల్పించే వారు ఉన్నారంటే నమ్ముతారా. అవును, అలాంటి వారు ఉన్నారు.

రోజూ 500మందికి ఉచితంగా డయాలసిస్, భోజనం కూడా.. దేశంలోనే అతిపెద్ద కిడ్నీ ఆసుపత్రి ప్రారంభం

Indias Biggest Kidney Dialysis Hospital

Indias biggest Kidney Dialysis Hospital: ఈ రోజుల్లో వైద్యం ఎంత కాస్ట్లీగా మారిందో తెలిసిందే. చిన్న చిన్న జబ్బులకే వందలు, వేలు ఖర్చు అవుతున్నాయి. అలాంటిది పెద్ద పెద్ద జబ్బులకు వైద్యం అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. పేదలు, మధ్య తరగతి వారిది అలాంటి పరిస్థితే. అలాంటి ఈ రోజుల్లోనూ ఉచితంగా చికిత్స చేయడంతో పాటు భోజన వసతి కూడా కల్పించే వారు ఉన్నారంటే నమ్ముతారా. అవును, అలాంటి వారు ఉన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి ఆసుపత్రి ఒకటి అందుబాటులోకి వచ్చింది. సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ అతిపెద్ద కిడ్నీ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చింది. రోజూ 500 మంది కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఉచిత డయాలసిస్‌ సౌకర్యం అందించేలా తీర్చిదిద్దిన ఈ ఆసుపత్రిలో బిల్లు ఊసే వినిపించదు. ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో అడుగుపెడుతూనే కనిపించే బిల్లింగ్‌ కౌంటర్‌ ఇక్కడ అస్సలు ఉండదు.

20 ఏళ్లకుపైగా మూతపడి ఉన్న బాలాసాహిబ్‌ ఆసుపత్రిని గురుహరికృష్ణన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ పేరుతో పునరుద్ధరించి దేశంలోనే అతిపెద్ద కిడ్నీ డయాలసిస్‌ ఆసుపత్రిగా మార్చారు. 24 గంటలూ రోగులకు వైద్యసేవలు అందించేలా సిద్ధం చేశారు. ఏకకాలంలో 101 మందికి డయాలసిస్‌ చేసేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ఈ లెక్కన నిత్యం 500 మందికి డయాలసిస్‌ అందించేంత విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి 101 పడకలున్న ఈ ఆసుపత్రిని త్వరలో వెయ్యి పడకల స్థాయికి తీసుకువెళ్లనున్నట్లు ఢిల్లీ సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ అధ్యక్షుడు మంజిందర్‌సింగ్‌ సిర్సా తెలిపారు.

అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలకు తోడు రోగులకు ఉచిత భోజన సౌకర్యం కూడా సమకూరుస్తారు. ఆసుపత్రి నిర్వహణకు అవసరమయ్యే వనరులను కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులు, వివిధ ప్రభుత్వ పథకాల నుంచి సమకూర్చుకుంటారు. దేశంలో కిడ్నీ వైద్య రంగంలో ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ల సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని యాజమాన్య ప్రతినిధులు తెలిపారు.