అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో…భారత్ కు చేరుకున్న ఇన్ఫోసిన్ ఉద్యోగులు
కరోనావైరస్ సంక్షోభం మరియు వీసా సమస్యల కారణంగా అమెరికాలో కష్టాలు పడుతున్న తమ ఉద్యోగులను ఆదుకునేందుకు ఇన్ఫోసిస్ సంస్ధ నడుంబిగించింది. ప్రత్యేక విమానంలో 200మంది (ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిపి)ని సోమవారం బెంగుళూరుకు తీసుకొచ్చింది. ఈ విషయాన్ని సంస్ధ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ బోడే తెలిపారు.
ఉద్యోగులను ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో శాన్ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు తీసుకొచ్చారని తెలిసింది. ఆ తర్వాత చాలామంది ఇన్ఫోసిస్ ఉద్యోగులు కంపెనీని ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు. భువనేశ్వర్లో వరదలు వచ్చినప్పుడు కూడా ఇన్ఫోసిస్ కంపెనీ చార్టర్ విమానంలో 500 మంది ఉద్యోగులను దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించింది.
చైనా నుంచి ప్రపంచమంతా పాకిన కరోనా వైరస్ మన జీవితాలపై ఊహించని స్ధాయిలో ప్రభావం చూపింది. అమెరికాలో పని చేస్తున్న కొందరు ఇన్ఫోసిస్ ఉద్యోగుల వీసా గడువు ముగిసిపోయింది. విమానాల రాకపోకలు ఆగిపోయాయి. అందుకే వారిని కుటుంబాలతో ఇండియాకు తీసుకురావడానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాం. వాళ్లు బెంగళూరుకు వచ్చేశారు కూడా. దీంతో కొన్ని వారాల డైలమాకు శుభం కార్డు పడింది’ అని బోడే తెలిపారు.
ఇన్ఫోసిస్ వార్షిక నివేదిక ప్రకారం కంపెనీకి అమెరికాలో 17,709 మంది ఉద్యోగులు ఉన్నారు. అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో, చాలా మంది తమను తిరిగి స్వదేశానికి చేర్చాలని కంపెనీకి విన్నవించుకున్నారు. ఇండియాకు వచ్చిన 76 మంది ఉద్యోగులు హెచ్1బీ, ఎల్1 వీసాలతో కంపెనీ అమెరికా కార్యాలయంలో పని చేసేవారు. ట్రంప్ నిర్ణయంతో.. వీసాలు రెన్యువల్ కావనే భావనతోనే ఇన్ఫోసిస్ ఉద్యోగులను తిరిగి భారత్కు తెచ్చిందని సమాచారం.