జాతీయగీతం వినగానే వీల్ చైర్ నుంచి లేచి నిలబడ్డ మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన దేశభక్తి మరోసారి చాటుకున్నారు.
Injured Mamta పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన దేశభక్తి మరోసారి చాటుకున్నారు. నందిగ్రామ్ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన మమతా బెనర్జీ…తన కాలికి గాయం అవడం వల్ల కొద్దిరోజులుగా వీల్ చైర్ లోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే రెండో విడత ఎన్నికల ప్రచారంలో చివరి రోజు(మార్చి-30,2021) నందిగ్రామ్ నియోజకవర్గంలో మమత ప్రచారం నిర్వహించారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది .
మమత నిర్వహించిన ఎన్నికల సభలో చివరగా జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో మమత తన సిబ్బంది సాయంతో వీల్ చైర్ నుంచి లేచి నిలబడ్డారు. ఆమె లేచి నిలబడేందుకు అక్కడే ఉన్న సహాయకులు ఆమెకు తోడ్పాటు అందించారు. జాతీయ గీతం ఆలపించిన తర్వాత తిరిగి వీల్ చైర్లో కూర్చున్నారు మమత.ఇక రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని ముగించే సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మమతా బెనర్జీ. తనకు కలిగిన గాయాల కారణంగా, తాను బీజేపీకి లొంగితే అది ప్రజల బాధగా మారుతుందన్నారు.
నందిగ్రామ్ నియోజకవర్గానికి ఏప్రిల్ ఒకటో తేదీన పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరపున మమతా బెనర్జీ, బీజేపీ తరపున సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ నియోజకవర్గంపై అందరి చూపు ఉంది. నందిగ్రామ్ లో గెలుపెవరిదనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.