సమాజానికి మంచిదేగా : కుల, మతాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు 

మతాంతర, కులాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మతాంతర, కులాంతర వివాహాలకు తాము వ్యతిరేకం కాదని చెప్పింది. అంతేకాదు ఇలాంటి పెళ్లిళ్లతో

  • Published By: veegamteam ,Published On : September 12, 2019 / 03:56 AM IST
సమాజానికి మంచిదేగా : కుల, మతాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు 

మతాంతర, కులాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మతాంతర, కులాంతర వివాహాలకు తాము వ్యతిరేకం కాదని చెప్పింది. అంతేకాదు ఇలాంటి పెళ్లిళ్లతో

మతాంతర, కులాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మతాంతర, కులాంతర వివాహాలకు తాము వ్యతిరేకం కాదని చెప్పింది. అంతేకాదు ఇలాంటి పెళ్లిళ్లతో సమాజానికి మంచి జరుగుతుందని, సోషలిజానికి (సమ సమాజానికి) తోడ్పడుతుందని సుప్రీంకోర్టు చెప్పింది. కొంతమంది దురుద్దేశంతో ఇలాంటి పెళ్లిళ్లు చేసుకుని, ఆ తర్వాత భార్యను వదిలేస్తున్నారని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఓ మతాంతర(హిందూ-ముస్లిం) వివాహానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

”మతాంతర వివాహాలకు మేం వ్యతిరేకం కాదు. హిందూ-ముస్లిం పెళ్లిళ్లు సమ్మతమే. చట్ట ప్రకారం పెళ్లి చేసుకుంటే సమస్యలు ఎందుకొస్తాయి?” అని జస్టిస్‌లు అరుణ్ మిశ్రా, ఎంఆర్ మిశ్రాతోకూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక ముస్లిం యువకుడు(33) 2018లో హిందూ యువతిని (23) పెళ్లి చేసుకున్నాడు. ఇందుకోసం అతడు హిందూ మతాన్ని స్వీకరించాడు. పెళ్లి తర్వాత అతడు తిరిగి ఇస్లాం స్వీకరించాడని యువతి తండ్రి ఆరోపించారు. ఇదంతా కుట్ర అని, మతాంతర వివాహాల ముసుగులో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దంపతులిద్దరూ కలిసి ఉండేందుకు హైకోర్టు అనుమతివ్వడంతో ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

అమ్మాయి తండ్రి తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. మతాంతర పెళ్లిళ్ల ముసుగులో ముఠా నడుస్తోందని, దీనిపై సుప్రీంకోర్టు దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. యువకుడి తరఫున సీనియర్ లాయర్ రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. యువతి తరఫున గోపాల్ శంకర్‌నారాయణ్ వాదనలు వినిపించారు. ఈ కేసులో విచారణ అవసరం లేదని చెబుతూ కేరళకు చెందిన హదియా కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఆయన ప్రస్తావించారు.

అందరి వాదనలు విన్న ధర్మాసనం మతాంతర పెళ్లిళ్లపై కీలక వ్యాఖ్యలు చేసింది. తాము ఈ పెళ్లి పై విచారణ చేయదలచుకోలేదని, కేవలం యువతి ప్రయోజనాలను కాపాడాలనుకుంటున్నామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా యువకుడిని మంచి భర్తగా, గొప్ప ప్రేమికుడిగా ఉండాలని సూచించింది. పెళ్లి తర్వాత చట్టప్రకారం పేరు మార్చుకున్నారా? అని ప్రశ్నించింది. కేసుపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన కోరుతూ తదుపరి విచారణను సెప్టెంబర్ 24కు వాయిదా వేసింది. మతాంతర, కులాంతర వివాహాలు సమాజానికి మంచివే అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు. ఇది మంచి పరిణామం అంటున్నారు. మతం, కులం పేరుతో మనషులు చంపుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితులు పోవాలని కొందరు మేధావులు ఆకాంక్షించారు. వేరు కులం అబ్బాయిని చేసుకుందని కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను కడతేరుస్తున్నారు. పరువు పేరుతో అమ్మాయిలను కన్నవారే చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్న క్రమంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మార్పు తెస్తాయని ఆశిస్తున్నారు.