జూన్ మధ్యలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం

  • Published By: venkaiahnaidu ,Published On : May 23, 2020 / 04:05 PM IST
జూన్ మధ్యలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం

అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించడంపై ఇవాళ(మే-23,2020)కేంద్ర విమానయానశాఖ మంత్రి  హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. ఆగస్టు నెలలోపు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామని హర్దీప్ సింగ్ పూరీ శనివారం స్పష్టం చేశారు. మార్చి 25 నుంచి లాక్‌డౌన్ కారణంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే.

అయితే సోమవారం(మే-25,2020)నుంచి దేశీయ విమానసర్వీసులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పుడు  ఆగస్టు లేదా సెప్టెంబరుకి ముందు అంతర్జాతీయ పౌర విమానయాన కార్యకలాపాల ప్రారంభానికి ప్రయత్నిస్తామని ఆశిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే ఖచ్చితంగా ఏ తేదీన పునఃప్రారంభిస్తామని చెప్పలేను.. కానీ, ఆగస్టు లేదా సెప్టెంబరులోగా ప్రారంభమవుతాయని ఎవరైనా చెబితే, పరిస్థితిని బట్టి అంతకు ముందే ఎందుకు కాకూడదని నా అభిప్రాయం అని పూరీ అన్నారు. 

COVID-19 వైరస్ ఊహించదగిన రీతిలో ఉంటే… జూన్ మధ్య లేదా జూలై చివరి నాటికే అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పౌర  హర్దీప్ సింగ్ పూరి అన్నారు.  శ్రీలంకలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి విమానాలు లేదా నౌకల ద్వారా తరలిస్తామని.. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అన్నారు. వందే భారత్ మిషన్ తొలి దశలోని 25 రోజుల్లో 50వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చామని తెలిపారు.

కాగా, తమిళనాడు, మహారాష్ట్రలు విమాన సర్వీసుల ప్రారంభించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినా సరే కేంద్రం అన్ని ప్రాంతాలకు దేశీయ విమాన సర్వీసులు సోమవారం నుంచి పునఃప్రారంభమవుతాయని పునరుద్ఘాటించింది. అరోగ్యవంతులైన వృద్ధులను ప్రయాణానికి అనుమతిస్తామని, వారిని ఆపబోమని తెలిపారు.