INX మీడియా కేసులో చిదంబరానికి స్వల్ప ఊరట
INX మీడియా కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర బెయిల్ కోరుతూ మాజీ కేంద్రమంత్రి చిదంబరం పిటిషన్పై సెప్టెంబరు 5న తీర్పు వెల్లడించనున్నట్లు సుప్రీంకోర్టు ఇవాళ(ఆగస్టు-29,2019) స్పష్టం చేసింది. అప్పటివరకు ఈడీ అధికారులు ఆయనను అరెస్టు చేయకుండా కోర్టు తాత్కాలిక రక్షణ కల్పించింది.
INX మీడియా కేసులో ఇప్పటికే సీబీఐ కస్టడీలో చిదంబరం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇదే కేసులో ఈడీ అరెస్టు నుంచి రక్షణ కోరుతూ సుప్రీంకోర్టులో చిదంబరం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఎ.ఎస్. బోపన్నల ధర్మాసనం సెప్టెంబరు 5న తీర్పును వెల్లడించనున్నట్లు తెలిపింది. అంతేగాక, ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈడీ కోర్టుకు తెలియజేయాలనుకుంటే వాటిని సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశించింది.