రైలు ప్రయాణికులకు చేదువార్త

  • Published By: chvmurthy ,Published On : August 31, 2019 / 03:07 PM IST
రైలు ప్రయాణికులకు చేదువార్త

రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ షాకిచ్చింది. ప్రయాణికులపై సర్వీసు చార్జీల భారం మోపింది. 2019, సెప్టెంబర్ 1 నుంచి ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో బుక్ చేసే రైలు టిక్కెట్లపై సర్వీస్ చార్జిని వసూలు చేయనుంది. కొత్త రూల్ ప్రకారం నాన్ ఏసీ క్లాస్ టిక్కెట్లపై రూ.15 (ఒక్క టిక్కెట్ కి), ఏసీ క్లాస్ టికెట్లపై రూ.30 సర్వీస్ చార్జిని వసూలు చేయనుంది. ఆన్ లైన్ లో బుక్ చేసుకునే టిక్కెట్లపై చార్జిలను విధిస్తారు. వీటికి తోడు జీఎస్‌టీని వసూలు చేస్తారు.

దేశంలో పెద్ద నోట్లు రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహించేందుకు అప్పట్లో రైలు టిక్కెట్లపై ఐఆర్‌సీటీసీ సర్వీస్ చార్జిని ఎత్తేసింది. అప్పట్లో నాన్ ఏసీ టిక్కెట్టుపై రూ.20, ఏసీ టిక్కెట్టుపై రూ.40 చార్జి వసూలు చేసేవారు. సర్వీస్ చార్జిలను ఎత్తేశాక ఆ మొత్తం భారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ భరిస్తూ వచ్చింది. ఆ భారాన్ని ఇక తాము మోయలేమని, సర్వీస్ చార్జిలను వసూలు చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వే బోర్డుకు సూచించారు.

దీంతో సర్వీస్ చార్జిలను విధించేందుకు జూలైలో ఐఆర్‌సీటీసీకి రైల్వే బోర్డు అనుమతినిచ్చింది. అందులో భాగంగానే సెప్టెంబరు 1 నుంచి యథావిధిగా ఐఆర్‌సీటీసీ సర్వీస్ చార్జిలను రైలు టిక్కెట్ల బుకింగ్‌పై వసూలు చేయనుంది.