తమిళనాడులో రైతు ఇంట్లో ఐటీ సోదాలు… రెండేళ్లలో అపార సంపద
IT raids in a farmers house at tamilnadu : ఆర్ధికంగా తీవ్ర నష్టాల్లో ఉన్న ఓ మోతుబరి రైతు రెండేళ్లలో అపార ధన సంపదన సమీకరించటం చర్చనీయాంశం అయ్యింది. దీంతో ఐటీ శాఖ అధికారులు ఆ రైతు ఇంటిపై దాడి చేసి అంత సంపదను ఎలా కూడ బెట్టాడా అని లెక్కతేల్చే పనిలో పడ్డారు.
తమిళనాడులోని కడలూరు జిల్లా బన్రూటి సమీపంలోని ముత్తుకృష్ణాపురం గ్రామానికి చెందిన సుగీష్ చంద్రన్ ఒక మోతుబరి రైతు. ఒకప్పుడు వీరికి పంటపొలాలు ఎక్కువే ఉండేవి. కాలక్రమంలో ఆస్తులన్నీ కరిగిపోయాయి. కొన్నేళ్లు ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు.
కానీ గత రెండేళ్లుగా వీరి సంపద అమాంతంగా పెరగటంతో ఐటీ అధికారులు కన్ను రైతుపై పడింది. పోగొట్టుకున్న స్ధలాల్ని మళ్లీ కొనడం, కొత్త స్ధలాలు కొనడం వంటివి చేయటంతో సుగీష్ చంద్రన్ ఆర్ధిక పరిస్ధితి ఎవ్వరూ ఊహించని స్ధాయికి పెరిగింది.
ఆస్ధులు ఈ స్ధాయిలో పెరగటానికి కారణం చెన్నైలో ఓ సంస్ధలో పని చేస్తున్న ఆయన కుమారుడు కోడలు, ముంబై లో మరో సంస్ధలో పనిచేస్తున్న ఆయన కుమార్తె అల్లుడు హస్తం ఉన్నట్లు ఐటీ అధికారులు కనుగొన్నారు. కరోనా లాక్ డౌన్ కు ముందు ఆ గ్రామంలో రాధాకృష్ణన్ అనే వ్యక్తికి చెందిన పురాతన బంగళానుసైతం వీరు కొనుగోలు చేశారు.
దీంతో ఆదాయపన్ను శాఖ అధికారులు వారం రోజులుగా రైతుకుటుంబంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి పదుల సంఖ్యలో వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు గత రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. కొడుకు కోడలు,కూతురుఅల్లుడ్ని టార్గెట్ చేసి సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.