ULF : కశ్మీర్ లో పౌరుల హత్యకు పాల్పడింది మేమే..వలస కూలీలకు హెచ్చరిక

జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల ఇద్దరు వలస కార్మికులు సహా 11 మంది పౌరుల హత్యకు పాల్పడింది తామేనని యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్(ULF) ప్రకటించుకుంది.

ULF : కశ్మీర్ లో పౌరుల హత్యకు పాల్పడింది మేమే..వలస కూలీలకు హెచ్చరిక

Kashmir

ULF    జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల ఇద్దరు వలస కార్మికులు సహా 11 మంది పౌరుల హత్యకు పాల్పడింది తామేనని యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్(ULF)  ప్రకటించుకుంది. వలస కూలీలు వెంటనే కశ్మీర్ వదిలి వెళ్లిపోవాలని తాజాగా విడుదల చేసిన ఓ లేఖలో ULF హెచ్చరించింది. దేశవ్యాప్తంగా ముస్లింలను హత్యలు చేస్తున్నారని, బీహార్ లో గడిచిన ఏడాది కాలంలో హిందూ అతివాదులు 200మందికి పైగా ముస్లింలను హత్య చేశారని…ముస్లింల హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ULF ఆ లేఖలో పేర్కొంది. కాగా,పాకిస్తాన్ ఉగ్రసంస్థ లష్కరే తోయిబా (లెట్)కు చెందిన ఆర్గనైజేషనే ఈ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్.

కశ్మీర్ లో పౌరుల హత్యలు కొనసాగుతున్న వేళ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం ఉగ్రవాదులు మరియు వారి సానుభూతిపరులను వేటాడటం ద్వారా వారి ప్రతి రక్తపు బొట్టుపై ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. జమ్మూ కాశ్మీర్ యొక్క శాంతి మరియు సామాజిక-ఆర్థిక పురోగతికి మరియు ప్రజల వ్యక్తిగత అభివృద్ధికి విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, జమ్మూకశ్మీర్ లో వేగవంతమైన అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నట్లు సిన్హా పునరుద్ఘాటించారు.

కాగా, ఆదివారం దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వాన్​పో ప్రాంతంలో స్థానికేతర కూలీలే లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడికి తెగబడ్డ విషయం తెలిసిందే. ఇది జమ్మూకశ్మీర్ లో 24 గంటల వ్యవధిలో కశ్మీరేతరులపై జరిగిన మూడో దాడి కావడం ఆందోళనకరం. ఆదివారం వాన్‌పోలో వలస కార్మికులు ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించిన ముష్కరులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వలస కూలీలు మరణించగా.. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

ALSO READ డెంగ్యూ వ్యాక్సిన్.. త్వరలో భారత్‌లోకి!