J&K Delimitation : జమ్మూలో కొత్తగా ఆరు,కశ్మీర్ లో ఒకటి..డీలిమిటేషన్ ప్రతిపాదనపై రగడ
జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ఏర్పాటైన మాజీ సుప్రీంకోర్టు జడ్జి రంజన్ దేశాయ్ నేతృత్వంలోని కమిషన్ ఇవాళ తన రెండో సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించింది.
J&K Delimitation : జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ఏర్పాటైన మాజీ సుప్రీంకోర్టు జడ్జి రంజన్ దేశాయ్ నేతృత్వంలోని కమిషన్ ఇవాళ తన రెండో సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించింది. జమ్ములో అదనంగా 6, కశ్మీర్లో ఒక స్థానాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలని కమిషన్ ప్రతిపాదించింది.
ప్రస్తుతం కశ్మీర్లో 46, జమ్ములో 37 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటికి అదనంగా జమ్ములో 6, కశ్మీర్లో 1 అసెంబ్లీ స్థానాన్ని పెంచాలని కమిషన్ ప్రతిపాదించింది. అలాగే ఎస్సీలకు 7, ఎస్టీలకు 9 స్థానాలు కేటాయించింది. ఇక పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో 24 సీట్లు ఖాళీగా ఉంటాయని కమిటీ పేర్కొంది. అయితే ఈ ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను డిసెంబర్ 31లోపు తెలపాలని పార్టీలకు కమిషన్ సూచించింది.
అయితే డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనను నేషనల్ కాన్ఫరెన్స్ సహా పీడీపీ,జేకే ఆప్నీ పార్టీ,పీపుల్స్ కాన్ఫరెన్స్ ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బీజేపీ రాజకీయ అజెండాను కమిషన్ అనుసరిస్తోందని ఆరోపించాయి. బీజేపీకి మిత్రపక్షాలుగా భావించే పార్టీలు సైతం.. కమిషన్ ముసాయిదా ప్రతిపాదనలను వ్యతిరేకించాయి. డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదన తమను నిరాశకు గురిచేసిందని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. జమ్ముకు 6, కశ్మీర్కు కేవలం ఒకే స్థానం ఇవ్వటం 2011 జనాభా లెక్కల ప్రకారం జరగలేదన్నారు ఒమర్ అబ్దుల్లా. తమ పరిశీలనలోని డేటాకు బదులుగా బీజేపీ అజెండాలోని అంశాలనే కమిషన్ పరిగణనలోకి తీసుకుందని ఆరోపించారు.
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజన దేశాయ్ నేతృత్వంలోని డీలిమిటేషన్ కమిషన్లో జమ్ముకశ్మీర్కు చెందిన ఐదుగురు లోక్సభ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా భారత ఎన్నికల ప్రధానాధికారి సుశీల్ చంద్ర ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సహా ఆ పార్టీ నుంచి ముగ్గురు ఎంపీలు తొలిసారి ఈ భేటీకి హాజరయ్యారు.
.