అయోధ్యలో బాంబు పేలుళ్లకు స్కెచ్ రెడీ!

  • Published By: venkaiahnaidu ,Published On : December 25, 2019 / 09:29 AM IST
అయోధ్యలో బాంబు పేలుళ్లకు స్కెచ్ రెడీ!

అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పనులు ప్రారంభమవుతున్న ఈ సమయంలో ఓ వార్త ఇప్పుడు అయోధ్య ప్రజలనే కాకుండా దేశ ప్రజలను కూడా భయపెడుతోంది. నిఘా వర్గాలు అందించిన ఓ సమాచారంతో ఇప్పుడు యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. దేశంలో ఐక్యంగా ఉన్న హిందూ-ముస్లింల మధ్య అల్లర్లకు స్కెచ్ రెడీ అయినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

అయోధ్య నగరమంతా బాంబు పేలుళ్తో దద్దరిల్లిపోవాలని పాకిస్తాన్ కు చెందిన ఉగ్రసంస్థ జైషేమహమ్మద్ నిర్ణయించిందని, ఈ మేరకు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ ముఠా సభ్యులకు ఫోన్ కాల్ చేసినట్లు నిఘా వర్గాలు కనిపెట్టి యూపీ పోలీసులకు సమాచారమందించారు. గత వారం నేపాల్ సరిహద్దు గుండా ఏడుగురు పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించారు.ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్,అయోధ్య నగరాల్లో దాక్కొని ఉండాలని వారికి జైషే మహమ్మద్ నుంచి ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఆ ఏడుగురు ఇప్పటికీ దొరకుండా తిరుగుతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. నిఘా వర్గాల సమాచారంతో యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. అయోధ్యలో భద్రతను మరింత టైట్ చేశారు.

దశాబ్దాల నాటి అయోధ్య భూవివాదం కేసులో గత నెలలో సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. సుప్రీం తీర్పుతో 100ఏళ్ల నాటి హిందువుల డిమాండ్ త్వరలో నేరవేరుతుందని ఇటీవల కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.