Jamili Elections: వచ్చేవి జమిలి ఎన్నికలేనా? ఇంతకీ కేంద్రం ఏం చెబుతోంది?
లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాల్సిన అవసరం ఉంది. 1951, 1952, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయి. 1968, 1969లో పలు అసెంబ్లీలు నిర్ణీత గడువు కంటే ముందే రద్దుకావడంతో జమిలి ఎన్నికలకు అంతరాయం కలిగింది. విడివిడిగా ఎన్నికల నిర్వహణతో బడ్జెట్ పెరిగిపోతోంది. పరిపాలనలో సుస్థిరత కోసం జమిలి ఎన్నికలే మేలు
Jamili Elections: చాలా కాలంగా జమిలి ఎన్నికల జపం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. వచ్చే ఎన్నికలను అలాగే నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. జమిలి ఎన్నికలైతేనే ఉపయోగకరమని కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తే నిర్వహణ భారమవడమే కాకుండా, ఖర్చు కూడా పెరుగుతోందని ప్రభుత్వం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా విపక్షాలు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో పై విధంగా సమాధానం ఇచ్చారు.
గురువారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ ‘‘లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాల్సిన అవసరం ఉంది. 1951, 1952, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయి. 1968, 1969లో పలు అసెంబ్లీలు నిర్ణీత గడువు కంటే ముందే రద్దుకావడంతో జమిలి ఎన్నికలకు అంతరాయం కలిగింది. విడివిడిగా ఎన్నికల నిర్వహణతో బడ్జెట్ పెరిగిపోతోంది. పరిపాలనలో సుస్థిరత కోసం జమిలి ఎన్నికలే మేలు. లా కమిషన్ తన 170వ నివేదికలోనూ ఇదే సూచించింది’’ అని కిరణ్ రిజిజు అన్నారు.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జమిలి ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. తరుచూ ఎన్నికలు జరగడం వల్ల పాలన గాడి తప్పుతోందని, అధికారంలో ఉన్నవారు కూడా ఎన్నికల మీద దృష్టి సారించాల్సి వస్తోందని, అందుకే జమిలి ఎన్నికలు పెడితే ఐదేళ్ల వరకు ఎన్నికల ప్రస్తావన ఉండదని కొందరు అంటున్నారు. ప్రభుత్వం కూడా అటుఇటుగా ఇదే సమాధానంతో ఏకీభవిస్తోంది. అయితే జమిలి ఎన్నికల నిర్వహణపై కొన్ని పార్టీల నేతల్లో పలు ఆందోళనలు ఉన్నాయి.