రాజకీయాలకు షా గుడ్ బై
ఐఏఎస్ అధికారిగా రాజీనామా చేసి,రాజకీయాల్లోకి వెళ్లిన షా ఫైజల్… పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పి మళ్లీ ఐఏఎస్ ఉద్యోగంలో తిరిగి చేరేందుకు రెడీ అవుతున్నాడు. సీనియర్ ఐఏఎస్ అధికారి షా ఫైజల్.. జమ్ముకశ్మీర్ ప్రభుత్వంలో తిరిగి సేవలు అందించే అవకాశాలు కనపడుతున్నాయి. గతేడాది ఫైజల్ ఇచ్చిన రాజీనామా లేఖను ఇంకా ఆమోదించలేదని ప్రభుత్వం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
2010లో సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సొంత రాష్ట్రంలో పోస్టింగ్ పొందారు ఫైజల్. నిజాయితీపరుడిగా పేరు సంపాదించారు.ఆర్టికల్ 370 రద్దు సమయంలో కశ్మీర్లోని అనేకమంది నేతలతో పాటు ఫైజల్ను కూడా ప్రజా భద్రత చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది జూన్లో ఫైజల్ విడుదలైన విషయం తెలిసిందే.
ఏళ్ల పాటు జమ్ముకశ్మీర్ ప్రభుత్వంలో సేవలు అందించిన ఐఏఎస్ అధికారి షా ఫైజల్… గతేడాది విధుల నుంచి తప్పుకున్నారు. 2019 ఆరంభంలో రాజకీయ అరంగేట్రం చేసి… జమ్ముకశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్(జేకేపీఎమ్)ను స్థాపించారు. కశ్మీర్ యువతకు జేకేపీఎమ్ ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా నిలుస్తుందని పదేపదే చెప్పారు.
అయితే రాజకీయాల్లో ఆయన విజయం సాధించలేకపోయారు. జేకేపీఎమ్ను ఏర్పాటు చేసినప్పటికీ.. ఇన్ని నెలలుగా ఫైజల్ పేరు ప్రభుత్వ అధికారిక వైబ్సైట్లోని ఐఏఎస్ అధికారుల జాబితాలో కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో ఆయన రాజీనామాను ఆమోదించలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆయన తిరిగి విధుల్లో చేరవచ్చని సంకేతాలిచ్చాయి. ఈ వార్తలకు ఊతమందిస్తూ తన ట్విట్టర్ బయోను పూర్తిగా మార్చేశారు ఫైజల్. జేకేపీఎమ్ వ్యవస్థాపకుడన్న విషయాన్ని డిలీట్ చేశారు.