షెడ్యూల్ ప్రకారమే.. నీట్, జేఈఈ పరీక్షలు.. కేంద్రం నిర్ణయం
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్, ఇతర ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ సంస్థలల్లో బీటెక్ అడ్మిషన్లకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తి లేదని, ముందుగా నిర్ణయించిన షెడ్యూలు తేదీల ప్రకారమే ప్రవేశ పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరోనా కారణంగా పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్ధుల అభ్యర్దులను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో వీటి నిర్వహణకు ప్రభుత్వం సనర్ధమౌతుంది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే జేఈఈ అడ్మిట్ కార్డులను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు దాదాపు 8.6లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 6.5 లక్షల మంది అడ్మిట్కార్డులు డౌన్లోడ్ చేసుకున్నారు. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ సెప్టెంబర్ 1 నుంచి 6 తేదీల్లో, జేఈఈ అడ్వాన్స్ పరీక్ష సెప్టెంబర్ 27న, నీట్ పరీక్ష సెప్టెంబర్ 13న జరగనుంది. నీట్కు సుమారు 16 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
కరోనా సంక్షోభ నేపథ్యంలో కేంద్ర గైడ్లైన్స్కు అనుగుణంగా పరీక్షా కేంద్రాల్లో శానిటైజేషన్ ఏర్పాట్లను చేయనున్నారు. ప్రతి విద్యార్థికి తాజా మాస్కులు, గ్లౌజులను అందించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారు పరీక్షా కేంద్రం, పరీక్ష నిర్వహణ నగరం మార్పును కోరే అవకాశాన్ని, అదికూడా ఐదుసార్లు మార్చుకునే విధంగా వెసులుబాటును ఎన్టీఏ కల్పించింది. ఈ విధానం కింద ఇప్పటివరకు జేఈఈకి దరఖాస్తు చేసుకున్న వారిలో 120 మంది, నీట్ అభ్యర్థుల్లో 95వేల మంది వినియోగించుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.