విజయం మనదే…తండ్రి ఆశీర్వాదం తీసుకున్న హేమంత్ సోరెన్

  • Published By: venkaiahnaidu ,Published On : December 23, 2019 / 09:59 AM IST
విజయం మనదే…తండ్రి ఆశీర్వాదం తీసుకున్న హేమంత్ సోరెన్

జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM)పార్టీ చీఫ్ హేమంత్ సోర్ తన తండ్రి,మాజీ సీఎం సిబు సోరెన్ ను రాంచీలోని ఆయన నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. జార్ఖండ్ ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న సమయంలో తండ్రిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు హేమంత్ సోరెన్. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే.

ఇవాళ(డిసెంబర్-23,2019)ఉదయం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి జేఎంఎం-కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తున్నాయి. మధ్యాహ్నాం 3గంటల వరకు కౌంటింగ్ సరళిని పరిశీలిస్తే..బీజేపీ 26స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా,జేఎంఎం-కాంగ్రెస్,ఆర్జేడీ కూటమి 44స్థానాల్లో ముందంజలో ఉంది. 81స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 41ని జేఎంఎం-కాంగ్రెస్,ఆర్జేడీ కూటమి ఇప్పటికే దాటేసింది. ఇప్పటికే కూటమి సీఎం అభ్యర్థిగా హేమంత్ సోరెన్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.

అధికారికంగా కూటమి విజయం గురించి ఎన్నికల కమిషన్ ప్రకటించడానికి మరికొన్ని గంటల సమయం ఉన్నప్పటికే ఇప్పటికే తమ విజయం ఖారారైందని సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కార్యకర్తలు. రెండు అసెంబ్లీ స్థానాలు బర్హయత్, డము్కా నుంచి పోటీ చేసిన హేమంత్ సోరెన్ ప్రస్తుతం రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.