Corona Fighter Baby : నెలలు నిండకుండానే జన్మించినా..మహమ్మారిని జయించిన శిశువు

Corona Fighter Baby : నెలలు నిండకుండానే జన్మించినా..మహమ్మారిని జయించిన శిశువు

Corona Fighter Baby

covid- 19 Fighter Baby : కరోనా వైరస్ బారిన పడి మహామహులే మృతి చెందుతున్నారు. కానీ ఓ శిశువు మాత్రం అమ్మ కడుపులోనే మహమ్మారి సోకినా దాన్ని తన చిట్టికాళ్లతో మట్టికరిపించింది. నెలలు నిండకుండానే అమ్మ కడుపులోంచి ఈ లోకంలోకి వచ్చినా..ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని జయించిన అత్యంత చిన్నవయస్కురాలిగా చరిత్ర క్రియేట్ చేసింది. కరోనా బారిన పడిన వెంటిలేటర్‌పై ఉన్న ఓ గర్భిణీకి నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చింది.

తల్లికడుపులో ఉండగానే కరోనా బారిన పడిన ఆ బిడ్డ మహమ్మారిని జయించిన అరుదైన ఘటనకు హైదరాబాద్‌ కొండాపూర్‌లోని కిమ్స్‌ కడల్స్‌ హాస్పిటల్ వేదికైంది. కరోనా బారిన పడిన గర్భిణికి నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డకు కిమ్స్ హాస్పిట్ డాక్టర్లు ఊపిరి పోసారు. ఆ బిడ్డను తల్లి ఒడికి చేర్చారు. ఈ అరుదైన ఘటనలో హైదరాబాద్‌ నగరంలోనే అతి పిన్న వయస్సులో కరోనాను గెలిచిన శిశువుగా ఆ నవజాత శిశువు రికార్డు క్రియేట్ చేసింది.

ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 28 వారాల గర్భిణీ కరోనా సోకి తీవ్రమైన లక్షణాలతో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు ఈ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతుండగా ఏప్రిల్‌ 17న నెలలు నిండని 1,000 గ్రాముల బరువుతో కూడిన నవజాత శిశువుకు ఆమె జన్మనిచ్చింది.

అలా తల్లి కడుపులో ఉండగానే కరోనాతో పుట్టినా..కోవిడ్‌ టెస్ట్‌ చేయగా నెగెటివ్‌ వచ్చింది. దీనికి కారణం తల్లి కడుపులో ఉండగానేబిడ్డకు కరోనా సోకినా లక్షణాలు బైటపడటానికి సమయం పట్టటం వల్లనే. కానీ వారంరోజుల తరువాత బిడ్డ ఊపిరి తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్నట్లుగా గుర్తించి డాక్టర్లు వెంటిలేటర్‌ అమర్చారు. ఆ తరువాత మరోసారి కరోనా టెస్ట్‌ చేయగా పాజిటివ్‌ అని తేలింది.

దీంతో శిశువు బరువు తగ్గిపోయింది. 1,000 గ్రాముల బరువు కోల్పోయి 920 గ్రాములకు తగ్గిపోయింది. అంటే 80 గ్రాముల బరువు కోల్పోయింది. ఆక్సిజన్‌ తీసుకోవడంలో శిశువు ఇబ్బందిపడుతుండటంతో ఆస్పత్రి నియోనాటాలజీ అండ్‌ పీడియాట్రిక్స్‌ క్లినికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సి.అపర్ణ ఆధ్వర్యంలో టీమ్ వెంటిలేటర్‌పైనే శిశువును కోవిడ్‌ ఐసోలేషన్‌ ఐసీయూకు తరలించి ఇంట్రావీనస్‌ యాంటీ బయాటిక్స్‌ ఇస్తూ ఆధునిక పద్ధతులలో చికిత్స చేశారు.

అలా శిశువు క్రమంగా కోలుకోవటం ప్రారంభించింది. అలా బిడ్డ కోలుకున్నాక మరోసారి పీసీఆర్‌ టెస్ట్‌ చేయగా నెగటివ్‌ రావడంతో డాక్టర్లు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. తరువాత శిశువును ఐసీయూ నుంచి చక్కని వెంటిలేషన్ ఉండే స్పెషల్ రూమ్ కు షిఫ్ట్ చేశారు. చక్కటి వెలుతురు, ఊష్ణోగ్రత కూడిన ప్రత్యేకమైన గదిలోకి మార్చి చికిత్స చేశారు. అలా దాదాపు 30 రోజులు అన్ని రకాల మెరుగైన చికిత్సలతో శిశువు 1,500 గ్రాముల బరువుకు చేరుకోవడంతో పాటు..చక్కటి ఆరోగ్యంగా తయారవ్వటంతో డిశ్చార్జి చేశారు. అలా కరోనా మహమ్మారితో శిశువు ఫైట్ చేసి నెగ్గింది.