Justice Arvind Bobde: నేడు పదవీ విరమణ చేయనున్న జస్టిస్ బోబ్డే
భారత సుప్రీంకోర్టు తదుపరి 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణను నియమిస్తూ ఇప్పటికే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజేఐగా కొనసాగుతున్న ఎస్ఏ బోబ్డే పదవికాలం నేటితో ముగుస్తుండంతో ఈరోజే ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
Justice Arvind Bobde: భారత సుప్రీంకోర్టు తదుపరి 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణను నియమిస్తూ ఇప్పటికే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజేఐగా కొనసాగుతున్న ఎస్ఏ బోబ్డే పదవికాలం నేటితో ముగుస్తుండంతో ఈరోజే ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం శనివారం సాయంత్రం జస్టిస్ బోబ్డే వీడ్కోలు సమావేశం నిర్వహించి తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమం వర్చువల్గా నిర్వహించనున్నారు.
రేపు రాష్ర్టపతి భవన్లో 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ చేత రాష్ర్టపతి రామ్నాథ్ కొవింద్ ప్రమాణం చేయించనుండగా జస్టిస్ బోబ్డేతో కలిసి జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనంలో కూర్చోనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా కోవిడ్ కారణంగా అతికొద్దిమంది అతిథుల సమక్షంలో జరగనుంది. ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, కేబినెట్ సెక్రటేరియట్ అధికారులు, న్యాయ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు మాత్రమే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.
జస్టిస్ ఎన్వీ రమణ 1957, ఆగస్ట్ 27న కృష్ణా జిల్లా పొన్నవరంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 2017 ఫిబ్రవరి 14 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. 2000 జూన్ 27 నుంచి 2013 సెప్టెంబర్ 1 వరకు 13సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. ఈ నెల 24న నూతన సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ ఎన్వీ రమణ వచ్చే ఏడాది ఆగస్టు 26 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఓ తెలుగు వ్యక్తి భారత ప్రధాన న్యాయమూర్తిగా నియామకం కావడంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.