మేము ఎక్కడికీ పారిపోలేదు : కల్కి భగవాన్
తాము దేశం విడిచి పెట్టి పారిపోలేదని, చెన్నై లోని నేమం ఆశ్రమంలోనే ఉన్నామని ప్రకటించారు కల్కి ఆశ్రమ వ్యవస్ధాపకులు విజయ్ కుమార్ నాయుడు, పద్మావతినాయుడు. ఈ మేరకు కల్కి ఆశ్రమం మంగళవారం అక్టోబరు 22న ఒక వీడియో విడుదల చేసింది. కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటకలోని ఆశ్రమాలపై ఐటీ దాడులు జరిగిన అనంతరం ఇన్నాళ్లకు కల్కి భగవాన్ అజ్ఞాతం వీడారు.
తమ ఆరోగ్యం బావుందని, తమ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ వీడియోలో విజయ్కుమార్ దంపతులు పేర్కొన్నారు. తాము దేశం విడిచి వెళ్లిపోయానని మీడియాలో కథనాలు వస్తున్నాయని, కానీ, తాము దేశం విడిచివెళ్లలేదని, వదంతులు నమ్మవద్దని వారు కోరారు. కల్కి ఆశ్రమ ప్రధాన కార్యాలయాల్లో యథావిధిగా కార్యక్రమాలు జరుగుతున్నాయని వారు తెలిపారు.
కల్కి ఆశ్రమాలపై ఓ వైపు ఐటీ సోదాలు జరుగుతుంటే అమ్మ భగవాన్, కల్కి భగవాన్ దేశం విడిచి వెళ్లిపోయారని వస్తున్న వార్తలను అమ్మ భగవాన్ కొట్టి పడేశారు. మీడియాలో వచ్చిన అసత్య కథనాలపై భక్తులు ఓర్పుగా ఉన్నందుకు అమ్మ భగవాన్ కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియాలో తమకు మద్దతు తెలిపిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. నేమం, సత్యలోకం లో యాధావిధిగా కార్యక్రమాలు జరుగుతున్నాయని అవసరాన్ని బట్టి తాము నేమంలో కానీ… సత్యలోకంలో కానీ ఉంటున్నామని వారు ఆవీడియోలో తెలిపారు.