Kalyan Singh : మాజీ సీఎం కన్నుమూత

ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత కల్యాణ్‌ సింగ్‌ (89) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో లక్నోలోని సంజయ్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స

Kalyan Singh : మాజీ సీఎం కన్నుమూత

Kalyan Singh

Kalyan Singh : ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత కల్యాణ్‌ సింగ్‌ (89) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో లక్నోలోని సంజయ్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం(ఆగస్టు 21,2021) రాత్రి తుదిశ్వాస విడిచారు. 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన అనేక కీలక పదవులు అలంకరించారు. 10 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ఎంపీగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గానూ ఆయన సేవలందించారు.

రాజకీయ ప్రస్థానం..
కల్యాణ్ సింగ్ 1932, జనవరి 5న తేజ్‌పాల్‌ సింగ్‌ లోధి, సీతాదేవి దంపతులకు అలీగఢ్‌ జిల్లా మధౌలీ గ్రామంలో జన్మించారు. 60 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన అరుదైన నేతగా కల్యాణ్ సింగ్‌ ఉత్తరప్రదేశ్, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి రాజస్థాన్‌ గవర్నర్‌ దాకా అంచెలంచెలుగా ఎదిగిన ఆయన రాజకీయ ప్రస్థానంలో మలుపులెన్నో.

1957లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా మొదలై ఆ తర్వాత జన్‌సంఘ్‌లో చేరడం ద్వారా రాజకీయ జీవితానికి పునాది వేసుకున్నారు. 1967లో అత్రౌలి నియోజకవర్గం నుంచి భారతీయ జన్‌సంఘ్‌ తరఫున పోటీచేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పట్నుంచి వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగించిన కల్యాణ్‌ సింగ్‌కు 1980లో బ్రేక్‌ పడింది.

ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (ఐ) నేత అన్వర్‌ఖాన్‌ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతోనే పరాజయం చవిచూశారు. ఆ తర్వాత 1985లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో దిగి 1996 వరకు విజయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 1967 నుంచి 2002 మధ్య కాలంలో అత్రౌలి నుంచి 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2002లో మాత్రం తాను స్థాపించిన రాష్ట్రీయ క్రాంతి పార్టీ తరఫున బరిలో నిలిచి గెలిచారు. ఈ క్రమంలోనే 1977-79లో యూపీ ఆరోగ్యమంత్రిగా, రెండు పర్యాయాలు సీఎంగా సేవలందించారు.

కల్యాణ్ సింగ్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కల్యాణ్ సింగ్ మరణ వార్తతో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామని అన్నారు.